ప్రజల భాగస్వామ్యం ఉంటే ఏ పనైనా సులభం అవుతుందని, దానిలో భాగంగానే బాన్సువాడ మున్సిపాలిటీలో ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి స్వచ్ఛ, ఆరోగ్య బాన్సువాడ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చెత్త రహిత, రోగ రహిత బాన్సువాడ కోసం ప్రత్యేక కార్యాచరణ ద్వారా పారిశుద్ధ్యం పనులు చేపట్టామని చెప్పారు. ఈరోజు ఆయన బాన్సువాడ పట్టణంలోని NGO కాలనీలో మురికి కాల్వలను, సిసి రోడ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా రాష్ట్రంలోని 12,751 గ్రామపంచాయతీలలో గ్రామ పంచాయితీ పాలక వర్గంతో పాటు, అధికారులు కూడా భాగస్వామ్యమై పారిశుద్ధ్యం, పచ్చదనం, రక్షిత మంచినీరు, దోమల నివారణ, డంపింగ్ యార్డుల నిర్మాణం, వైకుంఠధామాల నిర్మాణం, తదితర కార్యక్రమాలతో దేశంలోనే అతిపెద్ద కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అద్భుత ఫలితాలు సాధించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో పట్టణ ప్రాంతాలలో కూడా పారిశుద్ధ్యం, పచ్చదనం కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, మున్సిపాలిటీలలో కూడా ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో కార్యాచరణ పనులు ప్రారంభం కానున్నాయని, బాన్సువాడ మున్సిపాలిటీ లో ఈ రోజు నుండి పనులు ప్రారంభిస్తున్నామని స్పీకర్ తెలిపారు. గతంలో తడి చెత్త పొడి చెత్త లకు డస్ట్ బిన్ లు సరఫరా చేశామని, ప్రస్తుతం అదనంగా తడి చెత్త పొడి చెత్త డస్టుబిన్లు ఇంటింటికీ పంపిణీ చేస్తామని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా చెత్త వేసేందుకు డ్రమ్స్ ఏర్పాటు చేయాలని, దుకాణదారులు, ప్రజలు డ్రమ్ముల్లో చెత్త వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, మున్సిపల్ ప్రత్యేక అధికారి, ఆర్డిఓ రాజేశ్వర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ కుమారస్వామి, అధికారులు, ప్రజాప్రతినిధుల పాల్గొన్నారు.