రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా సహకరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడాలని అన్నారు.
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే ఇచ్చిన హామీలను 85 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ దని ఆయన అన్నారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని హామీలు అమలు చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ అని సజ్జల అన్నారు. చెప్పినవే కాకుండా చెప్పని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రవేశ పెడుతున్న నేత వైఎస్ జగన్ అని ఆయన కొనియాడారు.
వ్యవస్థలో మార్పుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని డబ్బులు, మద్యం ఇతర ప్రలోభాలు లేకుండా ఎన్నికలకు వెళ్లే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అధికారంలో ఉన్నా కూడా తనకు రాను పరీక్ష పెట్టుకున్న నేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల్లో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే వాడే నాయకుడని అన్నారు.
కోర్టు కొట్టివేసినా బిసిలకు 10 శాతం అదనపు రిజర్వేషన్ ఇస్తున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బిసిలకు ఎల్లపుడూ అండగా ఉంటుందని, బిసిల రిజర్వేషన్లు అడ్డుకుంది చంద్రబాబు, ఆయన అనుచరులేనన్నారు. కోర్టు నుండి స్టే తెచ్చింది చంద్రబాబు అనుచరుడు ప్రతాప్ రెడ్డి అని సజ్జల అన్నారు. అతనికి ఉపాధి హామీ డైరెక్టర్ పదవి ఇచ్చింది టీడీపీ నే అన్నారు. టీడీపీ కి దమ్ము ఉంటే బిసిలకు 34 శాతం సీట్లను ఇవ్వాలని సజ్జల అన్నారు. 59 శాతం ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి కుదించినా బిసిలకు న్యాయం చేస్తున్నాం అని తెలిపారు.