రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. పిఆర్సీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ నేడు ముఖ్యమంత్రితో సమావేశం అయింది. అనంతరం మంత్రి బొత్స సత్యానారాయణ మీడియాతో మాట్లాడారు. పీఆర్సీ ఇచ్చిన తర్వాత ఉద్యోగులకు కొన్ని సందేహాలు వ్యక్తం చేయడంతో వెంటనే ప్రభుత్వం స్పందించి కమిటీ వేసిందని తెలిపారు.
సమస్యలపై చర్చకు ఉద్యోగులను ఆహ్వానించామని, అయినప్పటికీ ఉద్యోగులు రాలేదన్నారు. మూడు రోజులు ఎదురు చూసినా ఉద్యోగులు రాలేదని, వాళ్లు రాకుండా ద్వితీయ శ్రేణి వాళ్లను పంపారని చెప్పారు. ఇకపై కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ వేశారని మంత్రి బొత్స తెలిపారు.
ఉద్యోగులు ఏ కోరిక కోరినా సమంజసంగా ఉండాలన్నారు సూచించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించకుండా నిరసన చేస్తూనే జీతాలు ఇవ్వమంటున్నారని, తాము ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. మాట తూలితే దానికి సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.