తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో ఆరవ రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు 25 వేల మంది గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు కీలక భూమిక పోషించారని, ఉద్యమ సమయంలో కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తామని తెలంగాణ ఏర్పడ్డాక తమశాఖను పట్టించుకోకుండా రెగ్యులరైజ్ మాటను విస్మరించారన్నారు.
ఉద్యోగ భద్రత లక్ష్యంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం నెరవేర్చెంతవరకు కొనసాగిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులంతా పోరాటానికి సిద్ధమయ్యామని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కొన్ని శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారని, తెలంగాణ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యాశాఖను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న తమను విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి నాయకులు వీణా, రాములు, శైలజ, కాళిదాసు, జిల్లాలోని 750 ఉద్యోగులు పాల్గొన్నారు.