ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో ఆర్ట్ , క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులను పని చేస్తున్నారు. వీరికి నాలుగు సంవత్సరాల నుంచి 14, 203/- రూపాయలు గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారు.
ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు తమ తమ స్కూలు విద్యార్ధులను ఇప్పటికే జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీలకు పంపించేంతటి ప్రతిభ చూపారు. అయినా విద్యార్థులకు, బోధకులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయ సహకారాలు రావడం లేదు.
అలాగే కే.జీ.బీ.వీ .ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా అధ్యాపకులకు కేవలం నెలకు 12,000/- గౌరవ వేతనం ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో కొంతమంది గెస్ట్ అధ్యాపకులకు కేవలం 10, 000/- రూపాయలు మాత్రమే జీతం చెల్లిస్తున్నారు.
ఇది మరీ అన్యాయం అని కే. జీ. బీ. వీ . అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు మాత్రం రూ. 37, 000 ఇస్తున్నారు. ఒక పని ఒకే విధంగా చేస్తున్నా కొందరికి అతి ఎక్కువ మరి కొందరికి అతి తక్కువ వేతనం ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఇంటర్మీడిట్ కళాశాలలో కూడా కేజీబీవీలో 90%, పైగా ఫలితాలను సాధించారు. తాత్కాలిక కే. జీ. బీ. వీ అధ్యాపకులు రోజూ పాఠశాలకు, కళాశాలలకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా వెళ్లి పని చేస్తున్నాఉద్యోగం వచ్చేసరికి పార్ట్ టైమ్ అని చెప్పి తక్కువ వేతనం ఇస్తున్నారు.
మరో విషయం ఏమిటంటే ప్రతీ ఏడాది జీతాలను నూతన వేతనాలు ప్రకారం ఎంతో కొంత శాతం పెంచుతామని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు చెబుతున్నప్పటికీ 5 సంవత్సరాల నుంచి నేటికీ ఒక రూపాయి పెరగక పోవడం విశేషం.