దళితబంధు పథకం ద్వారా మంజూరయిన డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. అధికారులతో డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ పై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితబంధు పథకం క్రింద 573 డెయిరీ యూనిట్లను మంజూరు చేసినట్లు, ఇందులో 100 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు తెలిపారు. పశువుల్లో లుంపి స్కిన్ వ్యాధి కారణంగా పశువుల రవాణాపై నిషేధం విధించడంతో డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ ఆలస్యమయినట్లు ఆయన అన్నారు. ప్రస్తుతం నిషేధం తొలగించడంతో యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు ముమ్మరం చేయాలన్నారు. 126 మంది లబ్దిదారులు పశు వైద్యులతో ఇప్పటికే హర్యానా, గుజరాత్ లలో గేదెల సేకరణకు వెళ్లినట్లు, సేకరణ అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇంకనూ 132 మంది లబ్ధిదారుల అంగీకారం ఉన్నట్లు, వీరిని సేకరణకై, పశు వైద్యుల తో వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. 3 పశు వైద్యులను హర్యానా, ఇద్దరిని గుజరాత్ కు లబ్దిదారులతో పంపినట్లు, మరో ఇద్దరు పశు వైద్యులను పంపుతున్నట్లు ఆయన తెలిపారు. పశువుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. సేకరించిన గేదెలు పాల ఉత్పత్తి విషయమై పశు వైద్యులు నివేదిక ఇవ్వాలన్నారు. యూనిట్ల సేకరణ అనంతరం గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి, లబ్దిదారులకు నిర్వహణపై అవగాహన తో పాటు, పాలు పితకటంపై శిక్షణ, సంరక్షణ కై చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యేక అధికారులు సేకరణకు వెళ్లిన లబ్దిదారులతో సేకరణ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలని, వారితో టచ్ లో ఉండాలన్నారు. ఈ సమీక్ష లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, ఎస్సి కార్పొరేషన్ ఇడి శ్రీనివాసరావు, జెడ్పి సిఇఓ అప్పారావు, పశుసంవర్ధక శాఖ ఎడి డా. భాను, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post