పేద ప్రజల కోసం సీఎం కేసీఆర్ రూపాయి ఖర్చులేకుండా సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం నగరం 8వ డివిజన్ నందు 234 మంది డబుల్ బెడ్ రూం ఇళ్ళ లబ్దిదారులకు పట్టాలు, రఘునాథపాలెం మండలం జింకలతండా బాధితులకు ఇళ్ళ పట్టాలను మంత్రి పువ్వాడ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే పేద ప్రజల కోసం ఖమ్మం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన వారందరికి ఇళ్లు వస్తాయని అన్నారు. పేదల ఆత్మగౌరవం పెంచేలా టేకులపల్లిలో 1250 ఇల్లు ఒకే దగ్గర ఇల్లు నిర్మించి పేదలకు మేలు కలిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. పేదవాడు తలెత్తుకుని సగర్వంగా చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఅర్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున ఇల్లు నిర్మించి ఇవ్వగలుగుతున్నామని పేర్కొన్నారు.
ఇలాంటి ఇళ్ళ ఇక చరిత్రలో ఎవ్వరూ ఇవ్వలేరని స్పష్టం చేశారు. మీ పేరు మీదనే శాశ్వతంగా ఉండేలా పట్టా ఇస్తున్నామని, దీనితో పాటు ఇంటి నెంబర్, ఇంటి పన్నుతో ఇవ్వడం జరిగింది అన్నారు. హైదరాబాద్ తరువాత ఒక్క ఖమ్మం టౌన్ లోనే పెద్ద ఎత్తున మొత్తం 2వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. ఆ నాడు పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చే అదృష్టం పువ్వాడ నాగేశ్వరరావుకి దక్కింది, నేడు ముఖ్యమంత్రి కేసీఅర్ సహకారంతో నేడు నాకు ఆ అవకాశం దక్కడం గర్వంగా ఉందన్నారు. ఖమ్మం నగరంలో అభివృధ్ధి, సంక్షేమం సమానంగా అందిస్తున్నామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఖమ్మం నగరంలోనే మొత్తం 30వేల మందికి వివిధ రకాల పెన్షన్ లు ఇస్తున్నామని అన్నారు.