సరదా సరదాగా సంక్రాంతి సంబరాలు…అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు….!
విజయనగరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శిల్పారామం వేదికగా జరిగిన సంక్రాంతి సంబరాలు సరదా సరదాగా సాగాయి. సంబరాల్లో భాగంగా నిర్వహించిన వివిధ కళాత్మక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షణలో నిర్వహించిన సంగీత గాత్ర కచేరీలు, నాట్య విన్యాసాలు, ఫాన్సీ డ్రెస్ పోటీలు, జానపద గేయాలాపనలు ఉత్సహంగా సాగాయి. మహారాజ సంగీత కళాశాల, అమృత వర్షిణి సంస్థ విద్యార్థులు, నిర్వాహకులు ఆలపించిన గీతాలు వీనుల విందుగా సాగాయి.
ఘంటశాల కళాపీఠం భీష్మా మాస్టారి ఆధ్వర్యంలో బృంద సభ్యులు అత్యంత హృద్యంగా అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ క్రమంలో జరిగిన ఫాన్సీ ఫ్రెష్ పోటీలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. పలువురు వృద్ధ కళాకారులు ఉత్సహంగా పాల్గొని పల్లె సంప్రదాయాలను ప్రతిబింబించే పలు జానపద గీతాలను ఆలపించి ఆహుతులను ఆనందింపజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డి.సి.ఎం.ఎస్. ఛైర్పర్సన్ అవనాపు భావన, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు కళాకారులను అభినందించారు.
విజేతలకు బహుమతులు
ఫాన్సీ డ్రెస్ పోటీల్లో ప్రథమ బహుమతి స్వర్ణ, ద్వితీయ బహుమతి అరుణ కుమారి, తృతీయ బహుమతి సుహాన గెలుచుకున్నారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. స్వచ్ఛందంగా పాల్గొన్న కళాకారులకు నిర్వాహకులు నగదు ప్రోత్సాహకం అందించింది సత్కరించారు.
పోటీలను జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, పర్యాటక శాఖ అధికారి లక్ష్మీనారాయణ, అడల్ట్ ఎడ్యుకేషన్ విభాగం డి.డి. సుగుణాకర్ రావు, మెప్మా పీడీ సుధాకర్, విజయనగరం తహశీల్దార్ బంగార్రాజు ఇతర అధికారులు పర్యవేక్షించారు.