స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ రాష్ట్రం) ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ ఈ విరాళాల చెక్కును తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్కి నేడు అందజేశారు. హైదరాబాద్ సర్కిల్ (తెలంగాణ రాష్ట్రం) ఉద్యోగులు మొత్తం రూ. 34,16,750 విరాళంగా అందచేశారు.
ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ (తెలంగాణ) డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, DGM & CDO జితేంద్ర కుమార్ శర్మ, సిఎస్ఓ లెఫ్టినెంట్ సిడిఆర్ అతుల్య ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ ఎస్ బి ఐ సిబ్బంది అందించిన ఈ సహకారం మరువలేనిదని అన్నారు. ఇటువంటి పనులు ఇతర సంస్థలు మరియు పౌరులను అనుకరించేలా స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. యుద్ధ అనుభవజ్ఞులు, మాజీ సైనికులు, యుద్ధ వితంతువులు మరియు వారిపై ఆధారపడిన వారి సంక్షేమానికి మద్దతుగా ఈ నిధిని వినియోగిస్తారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంలో, తెలంగాణ ప్రజలకు మద్దతు ఇవ్వడంలో ఎస్బిఐ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నందుకు ఆమె ప్రశంసించారు.
రాజేష్ కుమార్ మాట్లాడుతూ సమాజ పురోగతికి ఎస్బిఐ తన వంతు సాయం అందిస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ లక్ష్యం కోసం హైదరాబాద్ సర్కిల్ సిబ్బంది సమిష్టిగా ఫ్లాగ్ డే ఫండ్కి విరాళాలు అందించడం ప్రారంభించారని తెలిపారు. మాజీ సైనికులు, యుద్ధ వితంతువుల పిల్లల సంక్షేమానికి తమ మద్దతును అందించడానికి అందరం కట్టుబడి ఉన్నామని చెప్పారు. మన సైనికులకు మద్దతు ఇచ్చే విషయంలో ఎస్ బి ఐ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ఆయన వివరించారు.