పాత్రికేయులంటే కరివేపాకు లాంటి వారు. వాసనకే కానీ తినడానికి కాదు అంటున్నారు కడప జిల్లా అధికారులు. కరోనా వైరస్ నేపథ్యంలో అహర్నిశలూ ప్రజలను చైతన్య పరుస్తూ, తప్పుడు సమాచారం కాకుండా సరైన సమాచారం ఇస్తూ సమాజంలో శాంతి ఉండేలా చేస్తున్న విలేకరులంటే అధికారులకు మాత్రం ఎప్పటికీ చిన్న చూపే.
సరైన జీత భత్యాలు లేకపోయినా సమాజం కోసం ఒవర్ టైం పని చేసే విలేకరులు సంబంధిత అధికారుల నుంచి కనీస గౌరవాన్ని ఆశిస్తారు. నేడు కడప ఇన్ చార్జి మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులను పట్టించుకున్న నాథుడే లేడు.
గంటల తరబడి వేచి ఉండి దాహం కూడా తీర్చుకోవడానికి వీల్లేగుండా ఉన్న విలేకరులకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మజ్జిగ అందించింది. ఇదీ కడప జిల్లా అధికారుల పనితీరును గుర్తు చేసే సంఘటన. కోవిద్- 19 పై కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిములపు సురేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశ మందిరంలో సామాజిక దూరం పాటిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కూర్చున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రనాద్ రెడ్డి,మేడా మల్లికార్జున రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ పోగ్రామ్ కవరేజ్ కు వెళ్ళిన జర్నలిస్టులను ఐ అండ్ పిఆర్ అధికారులు పట్టించుకోలేదు. కడప ముస్లిం అసోసియేషన్ సభ్యులు మానవత్వంతో స్పందించి రిపోర్టర్లకు మజ్జిగ తో పాటు అరటిపండ్లను అందించారు. ఈ సంఘటన అంతా ఎక్కడో మారుమూల పల్లెలో కాదు కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులోనే జరిగింది. షేమ్ ఆన్ ఇన్ ఫర్మేషన్ డిపార్ట్ మెంట్. మీరు చేయాల్సిన పని ఒక స్వచ్ఛంద సంస్థ చేసింది.