కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలంలో మూడవ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్ర బండ రెంజల్, గుండె నెమలి, వాజిద్ నగర్, పుల్కల్,పెద్దదేవాడ గ్రామాల మీదుగా బిచ్కుందకు గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని, బంగారు తెలంగాణ చేస్తానని తన కుటుంబానికి బంగారు చేసుకున్నాడని అమె ఆరోపించారు. నిరుద్యోగులు తీవ్రస్థాయిలో నిరాశలో ఉన్నారని, ఇప్పటివరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం దారుణమని నిరుద్యోగుల ఉసురు కేసీఆర్ కు తప్పకుండా తగులుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని ఆమె తీవ్ర స్థాయిలో దుయ్య బుట్టారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అండదండలతో ఇసుక దందా కొనసాగుతున్నదని ఆరోపించారు. జుక్కల్ నియోజకవర్గం లో డబుల్ బెడ్రూమ్ ల జాడ లేదన్నారు.
తెరాస కమిషన్ల పార్టీగా మిగిలిపోతుందని రానున్న ఎన్నికల్లో తెలంగాణ లో తెరాస సర్కార్ ను గద్దె దించాలన్నారు . అమలు కానీ హామీలతో ప్రజలకు మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్, సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, రైతులకు రుణమాఫీ,నిరుపేదలకు పక్క గృహాలు, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ లాంటివి ఎన్నో ఉన్నాయని ఆమె గుర్తు చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాలను కొనసాగిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఆమె ఆధ్వర్యంలో పలువురు వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఆమెతోపాటు సంజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేష్ గౌడ్ తదితరులున్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం