తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబునాయుడికి ఊహించని పరాజయం ఎదురైంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మెజారిటీ పంచాయితీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు సొంతం చేసుకున్నారు.
పాతకాలపు నాయకులను నమ్ముకున్న చంద్రబాబునాయుడు పూర్తిగా మునిగిపోయారు. కుప్పంలోని మొత్తం 89 పంచాయితీలకు గాను 74 పంచాయితీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేవలం 15 పంచాయితీలలో మాత్రమే తెలుగుదేశం నాయకులు గెలిచారు.
కుప్పంలో ఉన్న రెండు ప్రధాన కులాలు అయిన గాండ్ల, పల్లె రెడ్లను చీల్చడంలో వైసీపీ కృతకృత్యం అయింది. అంతే కాకుండా యువతను ఆకర్షించడంలో కూడా వైసీపీ ముందడుగు వేసింది. దీంతో చంద్రబాబునాయుడు ఊహించని పరాభవాన్ని ఎదుర్కొన్నారు.
కుప్పంలో ఎప్పటికప్పుడు కొత్త నాయకులను ఆకర్షించడంలో చంద్రబాబునాయుడు పూర్తిగా వెనుకబడిపోయారు. పార్టీ నిర్మాణంపై ఆయన, ఆయన నమ్ముకున్న నాయకులు ఏ మాత్రం దృష్టి సారించలేకపోయారు.
దాంతో గ్రామ స్థాయిలో తెలుగుదేశం పార్టీ బేస్ కదలిపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉన్న గేనివారి శ్రీనివాసులు, మునిరత్నం లు కొత్త నాయకులను పార్టీలోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలం అయ్యారు. చంద్రబాబునాయుడు ఈ ఇద్దరిపైనే ఆధారపడి ఉండటంతో పార్టీ మొత్తం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
పాత కాలపు రాజకీయానికి కాలం చెల్లిందని గుర్తించకుండా స్థానిక నాయకులు ప్రవర్తించడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. ఎర్ర చంద్రనం స్మగ్లర్లు దాదాపు 40 కోట్ల రూపాయలు కేవలం ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఖర్చు చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపారు. వారంతా ఇప్పుడు స్వేచ్ఛ అనుభవిస్తున్నారు. చంద్రబాబును దెబ్బ కొట్టేందుకు వారంతా వైసీపీకి సహకరించారని అంటున్నారు.
మొత్తానికి పంచాయితీ ఎన్నికలలో పైచేయి సాధించిన వైసీపీ కాలర్ ఎగరేసింది. తెలుగుదేశం పార్టీ మొత్తం పరాజయభారంతో కుంగిపోతున్నది.