రాయలసీమ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కర్నూలు, కడప జిల్లాల ప్రజలు హత్యలు చేస్తారని అలాంటి వారికి విమానాశ్రయాలు అవసరమా అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాయలసీమ ప్రాంత ప్రజల సహనాన్ని,మంచితనాన్ని చేతగానితనంగా చూడకండని ఆయన హితవు పలికారు. రాయలసీమ జిల్లాల ప్రజలు తిరగబడితే బిజెపి నాయకులు జిల్లాలలో తిరగలేరని ఆయన అన్నారు.
సోము వీర్రాజు ను “ఎర్రగడ్డ ఆసుపత్రి” లో చేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల ఆయన మాట తీరు చూస్తుంటే బిజెపికి ఓట్లు వేసి గెలిపిస్తే చీప్ లిక్కర్ 70 రూపాయలకే ఇస్తాము అని నవ్వుల పాలయ్యారు. మొన్న రాజమహేంద్రవరంలో బీజేపీలోకి యువత రావాలని వారికి “కోళ్ల ఫారాలు” పెట్టిస్తాము అని ప్రకటించి జాతీయ పార్టీ ప్రతిష్టను దిగజార్చారు. ఈరోజు రాయలసీమ ప్రాంత ప్రజలను కించపరుస్తూ తన వయస్సుకు తగ్గట్టు కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం చూస్తే “చిన్న మెదడు” చితికి నట్లు అనుమానం కలుగుతుంది అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
రాయలసీమ జిల్లాలోని బిజెపి నాయకులకు పౌరుషం ఉంటే మీ తోక పదవులకు రాజీనామా చేయండి లేకపోతే మీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసి సోము వీర్రాజు ను ఇంటికి సాగనంపండి అని ఆయన అన్నారు. రాయలసీమ అంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి,తాళ్ళపాక అన్నమయ్య,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి ఎందరో మహనీయుల చరిత్ర కలిగిన గడ్డ సోము వీర్రాజు లాంటి నోటి దురద వారికి ఏం తెలుస్తుందని ఆయన అన్నారు. సోము వీర్రాజు దిగజారుడు మాటలను వెంటనే ఉపసంహరించుకొని రాయలసీమ ప్రాంత ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.