అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎల్లేని సుధాకర్ రావు
జాతీయ రహదారి (167K) పనులను జాప్యం లేకుండా చేపట్టాలని బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి ఎల్లేని సుధాకర్ రావు సంబంధిత అధికారులను కోరారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.600 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రూ. 600 కోట్ల వ్యయంతో సోమశిల బ్రిడ్జి నిర్మాణానికి కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఎల్లేని సుధాకర్ రావు చొరవ తీసుకున్నారు.
ఆయన చొరవ కారణంగానే జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జి డీపీఆర్ ను తొందరగా అప్రూవల్ చేయించినందుకు రాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కేంద్ర రవాణా సంస్థ తెలంగాణ రీజినల్ ఆఫీసర్ కుశ్వా లను నేడు ఎల్లేని సుధాకర్ రావు శాలువాతో సత్కరించారు. తన ప్రయత్నానికి సహకారం అందించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి పైన ఎల్లేని చూపిస్తున్న తపన, చిత్తశుద్ధిని అధికారులు కొనియాడారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రాజెక్టు కు సంబంధించిన టెండర్లను పిలిచి త్వరగా నిర్మాణ పనులు మొదలు పెట్టాలని గణపతి రెడ్డిని ఎల్లేని కోరారు. పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కుశ్వాను కోరారు. గణపతి రెడ్డి, కుశ్వా దీనికి సానుకూలంగా స్పందించారు. వీలైనంత తొందరగా టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని తెలిపారు.