సెలవుపై వెళ్లిన ఎస్పీ….స్పందన మొత్తం చూసిన అదనపు ఏఎస్పీ..!
ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా…పదవీ విరమణపొందాల్సిన ఉద్యోగస్తులందరూ.. ఊసురోమంటూ గత్యంతరం లేక విధులు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు రిటైర్మెంట్ పెంచడంతో ఈ రెండు నెలలో రిటైర్ అవ్వాల్సిన చాలామంది అధికారులు…కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా విజయనగరం జిల్లా అదనపు ఎస్పీ సత్యనారాయణ రిటైర్ అవ్వాల్సి ఉండగా…ప్రభుత్వం రిటైర్మెంట్ గడువు పెంచారు. ఈ నేపధ్యంలో జిల్లా ఎస్పీ దీపిక శెలవు పెట్టడంతో…అదనపు ఎస్పీ గా సత్యనారాయణ …పోలీస్ శాఖలో ప్రతీ వారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని…ఈసారి ఆయనే స్వయంగా తీసుకున్నారు.
ఎస్పీ లేని లోటును కూడా పూర్తిగా భర్తీ చేసి…ఒకే ఒక్క పోలీస్ అధికారే..మొత్తం 25మంది బాధితుల నుంచీ ఫిర్యాదులను స్వీకరించారు.. ఈ మేరకు సామాన్య ప్రజల నుండి జిల్లా అదనపు ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని,అక్కడిక్కడే సంబందిత అధికారులతో ఫోనులో మాట్లాడారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని, ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. “స్పందన” కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు ఎస్పీ 25 ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఆ ఫిర్యాదులేంటో..ఎవ్వరెవ్వరు ఇచ్చారో ఒకసారి చూద్దాం
విజయనగరం గొల్లవీదికి చెందిన ఫిర్యాది అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను పిఎస్ఆర్కాం ప్లెక్స్ లో కారు స్పేరు పార్ట్సు అమ్మే దుకాణం పెట్టుకొని, వ్యాపారం చేస్తున్నానని, కే.ఎల్.పురంలో గ్యారేజీ నడుపుతున్న ఒక వ్యక్తి తన షాపులో 21 వేలు విలువైన స్పేర్ పార్టు కొనుగోలు చేసి, నేటి వరకు డబ్బులు తిరిగి చెల్లించడం లేదని, న్యాయం చేయమని ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ బాధితుడికి న్యాయం చేయాలని వన్ టౌన్ సీఐను ఆదేశించారు.
నెల్లిమర్ల మండలం కొండ వెలగాడకు చెందిన ఓ బాధితురాలు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తన భర్త త్రాగి వస్తూ, కుటుంబ పోషణ పట్టించుకోవడం లేదని, తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ విచారణ జరిపి, బాధితురాలికి న్యాయం చేయాలని దిశ మహిళా పిఎస్ డిఎస్పీని ఆదేశించారు.
విజయనగరం కుప్పిలివీదికి చెందిన మరో బాదితురాలు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు గరివిడి మండలం దేవాడకు చెందిన వ్యక్తితో 2020లో వివాహం జరిగిందని, తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకొని, తనను అదనంగా కట్నం తెమ్మనమని వేధిస్తున్నాడని, ఆ బాధలను భరించలేక ఇటీవల తన కన్నవారింటి వచ్చేసినట్లు, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ ఇరు కుటుంబాలను పిలిపించి, కౌన్సిలింగు చేయాలని, ఫిర్యాదికి న్యాయం చేయాలని గరివిడి ఎస్ఐ లీలావతిని ఆదేశించారు.
దివ్యాంగుడిపై దైర్జన్యం చేసిన షాపు యజమాని
వేపాడ మండలంకు చెందిన ఒక దివ్యాంగుడు అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తాను వేపాడలో ఫ్యాన్సీ షాపు నడుపుకొంటున్నానని, తన షాపుకు కొద్ది దూరంలో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్ళగా, షాపు యజమాని షాపులోకి ప్రవేసించి, క్యాష్ కౌంటరులో ఉన్న 25వేలు తీసినట్లు, సదరు విషయమై న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ విచారణ చేపట్టి, చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, ఫిర్యాదిదారుడికి న్యాయం చేయాలని ఎస్.కోట సిఐను ఆదేశించారు.
కొత్తవలస మండలం వి.బి. పురంకు చెందిన ఇంకో అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకు నెల్లిమర్ల మండలం రామతీర్ధంకు చెందిన వ్యక్తితో 2019లో వివాహం జరిగినట్లు, తనకు ఒక కుమారుడు కూడా ఉన్నట్లు, తన భర్త, వారి కుటుంబ సభ్యులు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అదనపు ఎస్పీ ఇరు వర్గాలకు కౌన్సిలింగు నిర్వహించాలని, వినకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిశ మహిళా పిఎస్ డిఎస్పీని ఆదేశించారు.
మొత్తం 25 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ…, విచారణ చేపట్టి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శాఖా సిబ్బందిని అదేశించారు. అలాగే ఫిర్యాదుల పై తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ కార్యాలయంకు వెంటనే నివేదించాలనిఅధికారులను జిల్లా అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ మురళీ, డీసీఆర్బీ సీఐ డా.వెంకటరావు లు పాల్గొన్నారు.