37.2 C
Hyderabad
May 6, 2024 11: 53 AM
Slider ప్రత్యేకం

అనుమానాల మధ్య జరుగుతున్న ఆందోళనలు

old city cab

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్

పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఎందుకు? ఈ చట్టం అంత ప్రమాదకరమైనదా? ఈ చట్టంలో దేశం మొత్తం మత ప్రాతిపదికన విచ్ఛిన్నం అయ్యేంత ప్రమాదకర అంశాలు ఉన్నాయా? ఈ చట్టం కార్యరూపంలోకి వచ్చేస్తే ఈ దేశంలోని ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా అయిపోతారా? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మదిలో తిరుగుతున్నాయి.

సమాధానం రావడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన సమాధానాలు నమ్మాలో వద్దో తెలియని పరిస్థితి. ఈ అసందిగ్ధ పరిస్థితుల్లోనే దేశం అలజడులు కొనసాగుతున్నాయి. వాస్తవ పరిస్థితి ఆలోచిస్తే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ చట్టం కూలంకషంగా పరిశీలిస్తే అర్ధం అవుతుంది.

ఈ చట్టం వల్ల మన దేశంలో అంతర్గతంగా భారీ మార్పులు వచ్చేసే అవకాశమే లేదు. కేవలం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నదనే రాజకీయ కారణం ఒక్కటే గొడవలకు కారణంగా కనిపిస్తున్నది. రాజకీయ పరమైన అంశాలను పక్కన పెడితే పౌరసత్వ సవరణ చట్టం అకస్మాత్తుగా తెచ్చిన చట్టం కాదు. ఒక్క రోజులో వచ్చిందీ కాదు.

పౌరసత్వ సవరణ బిల్లు 2016 నుండి చర్చలలోనే ఉంది. ఈ అంశంపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని పార్టీలూ ఈ బిల్లు తీసుకురావాలని ఒక్కో సందర్భంలో ఒక్కో పార్టీ చొప్పున కోరుతూనే ఉన్నాయి. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ బిల్లును క్లియర్ చేసింది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన 30 మంది లోక్ సభ, రాజ్య సభ సభ్యులు ఉన్నారు.

ఈ విధంగా వివిధ దశలను దాటిన ఆ బిల్లు ఉభయ సభల ఆమోదం పొంది చట్టంగా మారుతున్నది. మూడు దేశాలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వీలుకల్పిస్తున్నది. చట్టంలో ఈ క్లాజ్ వరకూ అందరూ కోరుకుంటున్నదే. అయితే మూడు దేశాలకు చెందిన ఆరు మైనారిటీ వర్గాల పౌరులు- అనే విషయం పైనే వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రతిపక్ష పార్టీలు, ముస్లిం మతస్తులు అడుతున్నది ఒక్కటే – దేశ పౌరసత్వానికి మతానికి ఎలా ముడిపెడతారు అని. మన దేశం చుట్టూ ఉన్న దేశాలు ముస్లిం దేశాలు. అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు మత వివక్షను ఎదుర్కొంటున్నారు. మత వివక్ష ఎదుర్కొంటున్న వారిని మత ప్రాతిపదికన కాకుండా మరెలా చూడాలి? అందుకే చట్టంలో మత ప్రాతిపదిక పెట్టాల్సి వచ్చింది.

అంతే తప్ప ఈ చట్టం దేశంలో పుట్టి ఇక్కడే బతుకుతున్న వారికి సంబంధించింది కాదు. వారు ముస్లింలు అయినా మరెవరైనా. భారత్ కు వస్తున్న శరణార్థులు మతప్రాతిపదికనే వారి వారి దేశాలలోని మెజారిటీ మతస్థుల హింసకు తట్టుకోలేక వలస వస్తున్నారు కదా?

అలా మత ప్రాతిపదికన వస్తున్న వారికి భారత పౌర సత్వం ఇచ్చే సమయంలో మత ప్రస్తావన లేకుండా చట్టాన్ని ఎలా రూపొందిస్తారు? మన చుట్టూ ముస్లిం దేశాలు ఉండటం వల్ల అక్కడ మెజారిటీ ప్రజలైన ముస్లింలు వేధించే మతాల వారు మన దేశానికి వలస వస్తుంటారు. అలా ముస్లిం దేశాల నుంచి మత హింసను తట్టుకోలేక ముస్లింలు వలస వచ్చే అవకాశం లేదు కదా?

మయన్మార్ సమస్యను పక్కన పెట్టి ఆలోచిస్తే ఈ చట్టంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. 2014 లో భారత్, బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు ఒప్పందం కుదిరింది.  50 పరగణాలను బంగ్లాదేశ్ నుండి భారతదేశంలోకి చేర్చారు.  ఫలితంగా, 14864 బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం లభించింది.  హోం మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం వీరిలో అత్యధికులు ముస్లింలే.

చట్టంలో పేర్కొన్న నిబంధనల ప్రకారం, మతపరమైన హింసకు గురైన బాధితులు 2014 డిసెంబర్ నాటికి భారతదేశానికి వచ్చిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుంది. ఈ వర్గంలో చాలా మందికి భారత ప్రభుత్వం దీర్ఘకాలిక వీసా పథకాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టింది. ఈ కోవకు చెందిన వారు చాలా కాలంగా భారత భూభాగంలోనే ఉంటున్నారు. వీరు ఇప్పుడు పౌర సవరణ చట్టం క్రింద భారతదేశ పౌరసత్వం పొందుతారు.

ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వ ప్రత్యేక నిబంధనల ప్రకారం విదేశీ పౌరులకు భారత పౌరసత్వం కల్పిస్తూనే ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ఆరేళ్లలో 2830 మంది పాకిస్తానీ పౌరులు, 912 మంది ఆఫ్ఘనియులు, 172 మంది బంగ్లాదేశీయులను భారత పౌరులుగా చేశారు. 1964- 2008 మధ్య కాలంలో భారత సంతతికి చెందిన 4.61 లక్షల తమిళులకు భారత పౌరసత్వం లభించింది.

1964,1974 లో భారత శ్రీలంక మధ్య అంతర్జాతీయ ఒప్పందం ఉన్నందున తమిళులు ఇంత పెద్ద సంఖ్యలో పౌరసత్వం పొందే వీలుకలిగింది. ప్రస్తుతం 95 వేల మంది శ్రీలంక శరణార్థులు తమిళనాడులో నివసిస్తున్నారు. వారికి రేషన్ కార్డులతో సహా ఇతర సౌకర్యాలు కల్పించారు. 

సకాలంలో భారతీయ పౌరసత్వం పొందడానికి వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇప్పుడు వీలుకలుగుతుంది. 1962-1978 మధ్య, బర్మాలో నివసించిన భారతీయ సంతతికి చెందిన రెండు లక్షలకు పైగా ప్రజలు భారతదేశంలో స్థిరపడ్డారు. కారణం, వారికి బర్మాలో పెద్ద వ్యాపారం ఉంది, కాని దానిని అక్కడి ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది.

ఈ ప్రజలు మన దేశానికి వచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారు.

అసలే మత హింసతో బాధపడుతూ ఉన్నది వదిలేసుకుని వచ్చిన తర్వాత కూడా అక్రమ పౌరులుగా ఉంటున్నారనే అవమానాన్ని దిగమింగుకునే వారికి ఈ చట్టం మేలుకలిగిస్తుంది. అంతే తప్ప దేశంలో ఉండే వారికి, ఇక్కడ పుట్టిన వారికి ఈ చట్టంతో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ చట్టం వల్ల తీవ్రంగా నష్టపోయేవి ఈశాన్య రాష్ట్రాలలో నివసించే కొన్ని జాతులు.

వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వంపై ఉంది. వారికి రక్షణ కల్పిచడం తక్షణ అవసరం. పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలలో, పశ్చిమబెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలో జరిగే ఆందోళలకు అర్ధం ఉంది. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతా ఉంది.

అంతే తప్ప దేశంలోని మిగిలిన ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలలో జరిగే ఆందోళనలన్నీ రాజకీయ ప్రేరేపితమే. బిజెపి హిందూత్వ ఎజెండాను అమలు చేయడం కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నది అనేది ప్రతిపక్షాల వాదన. అలాంటిది ఒక భయమే తప్ప దానికి ఆస్కారం ఉండదు.

Related posts

కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ కు చర్యలు

Bhavani

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపి ప్రభుత్వం

Satyam NEWS

కేంద్రం తెస్తున్న విద్యుత్ బిల్లుకు మేం వ్యతిరేకం

Satyam NEWS

Leave a Comment