రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జాతీయ రహదారుల పనులను రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు పరిశీలించారు. మహబూబాబాద్ నుంచి మేడారం వరకు రోడ్ల పనులను సంబంధిత జాతీయ రహదారుల అధికారులతో కలిసి మంత్రి పర్యవేక్షించారు.
ఇందులో భాగంగా మహబూబాబాద్ లోని కంబాలపల్లి నుంచి నర్సంపేట వరకు జాతీయ రహదారుల పనులను చూశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే పనులను పూర్తి చేసి రోడ్లు అందుబాటులో కి తీసుకురావాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. సరైన సిబ్బంది, యంత్రాలు లేక పనులు నెమ్మదిగా నడుస్తున్నాయని, వెంటనే సిబ్బందిని, యంత్రాలు పెంచాలన్నారు.
పనులు వేగవంతం చేసే క్రమంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, పనుల నాణ్యతలో లోపాలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పనుల నాణ్యత అధ్వాన్నంగా ఉందని, జాతీయ రహదారుల కంటే ఆర్ అండ్ బి రోడ్ల నాణ్యతే బాగుందని, ఇదే తీరు కొనసాగితే ప్రజలు ఇబ్బంది పడతారని, అలా జరగకుండా చూసుకోవాలని చెప్పారు.
నాణ్యత ప్రమాణాలు పాటించడం కోసం నిరంతరం రోడ్ల పనులను దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. రోడ్ వేయడంతో పాటు దాని నిర్వహణ కూడా ఎప్పటికప్పుడు చేసేలా సంబంధిత ఏజెన్సీ కి, అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.
నిన్న కాంగ్రెస్ శాసనసభ్యురాలు సీతక్క కూడా మేడారం జాతర పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం సత్యం న్యూస్ వీక్షకులకు తెలుసు. కాంట్రాక్టర్లు చేసే పనివిధానం చూస్తుంటే జాతర నాటికి పూర్తి అయ్యేలా లేవని ఆమె వ్యాఖ్యానించారు. మంత్రి సత్యవతి కూడా ఇదే విధమైన వ్యాఖ్యాలు చేయడం ఇక్కడ గమనార్హం.