సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమ లింగేశ్వర స్వామి వారి కోవెలలో పవిత్ర కార్తీకమాసం శుభ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.
కార్తీక మాసం సోమవారం పౌర్ణమి విశేష పర్వదినం కావడంతో బ్రాహ్మీ ముహూర్తం నుండే భక్తులు అధిక సంఖ్యలో ఆలయంలో బారులు తీరారు. దేవస్థానం చైర్మన్ కీత మల్లికార్జున రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి నేతృత్వంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సకల ఏర్పాట్లు గావించారు.అర్చకులు రెంటాల సతీష్ శర్మ, దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలతో,పంచసూక్తలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు జరిగాయి.
తెల్లవారుజామున నుండే విశేష సంఖ్యలో కోవెలకు చేరుకున్న మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమ లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు పీటలపై కూర్చుండి గణపతి,నవగ్రహ,రుద్ర హోమములు నిర్వహించారు. మహిళా భక్తులు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం,శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం భక్తితో చేశారు.
అనంతరం స్వామివారిని వివిధ పుష్పమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి,ధూప,దీప,నైవేద్య,నీరాజ మహా మంత్రపుష్పం సమర్పించి తీర్థ ప్రసాద వితరణ చేశారు.ప్రదోషకాల సమయంలో శ్రీ పార్వతీ దేవి అమ్మవారికి మహిళా భక్తులు సహస్రనామ కుంకుమార్చన, ఆకాశదీపం భక్తితో చేశారు.మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి దేవాలయం ఉదయం గం.8:30 నిమిషములకు మూసి వేయడం జరుగుతుందని, తదుపరి బుధవారం తెల్లవారుజామున ఆలయ సంప్రోక్షణ గావించి యధాతధంగా భక్తులకు దర్శనం కలిగిస్తారని ఆలయం కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కంచర్ల శ్రీనివాసరెడ్డి,వంకాయల పద్మావతి, ప్రతికంఠం భారతి,ఆసోదు శ్రీనివాస్,కోటా సూర్యప్రకాశరావు,సురేష్,కోటేశ్వరరావు, వాసా శ్రీనివాసరావు,నర్సింహారావు,అశోక్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.