ఈ నెల 28 వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కిన్నెరసాని క్రీడా పాఠశాలలో నిర్వహించనున్న ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని భద్రాచలం ఐటిడిఏ పిఓ పోట్రూ గౌతమ్ తెలిపారు. ఇంటర్ సొసైటీ స్పోర్ట్స్ లీగ్ క్రీడల నిర్వహణపై గిరిజన సంక్షేమ, ఎస్సి గురుకుల ఆర్సిఓ, విద్య, పంచాయతీ, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన విదులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13 అంశాల్లో నిర్వహించనున్న ఈ క్రీడా పోటీలకు ఏడు సొసైటీల నుంచి 3500 మంది బాలురు బాలికలు ఈ స్పోర్ట్స్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. భోజన కౌంటర్లు వద్ద రద్దీ నియంత్రణకు కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
క్రీడాకారులకు వసతి సౌకర్యం కల్పనకు ఇన్చార్జిలను నియమించినట్లు చెప్పారు. వసతి కల్పనాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మరమ్మత్తులు నిర్వహించి సిద్ధం చేయాలని చెప్పారు. మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్రీడాకారులకు, రిఫరీలకు వేరు వేరుగా వసతి సౌకర్యం కల్పించాలని చెప్పారు. భోజనాలు వద్ద బారికేడ్లు, టెంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్పోర్ట్స్ ఈవెంట్ క్యాలెండర్ తయారు చేయాలని ఆయన క్రీడల అధికారిని ఆదేశించారు. క్రీడా మైదానంలో విద్యుత్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, డిపిఓ రమాకాంత్, పాల్వంచ మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, గిరిజన ఇంజనీరింగ్ ఈ ఈ తానాజీ, డిఈ రాములు, డిఈఓ సోమశేఖర శర్మ, ఎస్సీ గురుకుల ఆర్ సి ఓ ప్రత్యూష తదితరులు, క్రీడల అధికారి వీరు నాయక్, ఏటిడబ్ల్యుఓ లు తదితరులు పాల్గొన్నారు.