రక్షా బంధన్ నే రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నా, చెల్లెళ్ళు,అక్కా,తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు సూచికగా ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు.
రాఖీ పౌర్ణమి విశిష్టత
కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు.నేడు దేశమంతా జరుపుకుంటున్నారు. అన్నకు గాని,తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని(రక్షా కంకణం)కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం.
రాఖీ అనగా రక్షణ బంధం.ఇది అన్నా,చెల్లెళ్ళు,అక్కా,తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ.చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటారు.
అధికారిక పేరు రాఖీ పౌర్ణమి.రాఖీ పండుగను జరుపుకొనేవారు హిందువులు, జైనులు,సిక్కులు,ముస్లిం, బౌద్ధులు,క్రైస్తవలు జరుపుకొనే రోజు పౌర్ణమి (శ్రావణ పూర్ణిమ)22/08/21 తేది ఆదివారం.
రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే?
పూర్వం దేవతలకు,రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై అమరావతిలో తలదాచుకుంటాడు.భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది.రాక్షస రాజు అమరావతిని దిగ్భంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్గిస్తుంది.సరిగ్గా ఆ రోజు ‘శ్రావణ పౌర్ణమి’ కావడంతో పార్వతీపరమేశ్వరులను,లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది.అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు.
శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. రాఖీపౌర్ణమి కి మరో చరిత్ర కూడా ఉంది
ద్రౌపది – శ్రీకృష్ణుని అన్నా చెల్లెల బంధం
ఇతిహాసాల ప్రకారం గమనిస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది.శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట.దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు.అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.
అలెగ్జాండర్ భార్య – పురుషోత్తముడి కథ
చరిత్రపుటల్లో అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు.ఆ క్రమంలో బాక్ట్రియా(నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను,ముఖ్యంగా జీలం,చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన.అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు.పురుషోత్తముడి శత్రు రాజు అంబి,అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు.అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది.తన భర్త అయిన అలెగ్జాండర్ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్ను చంపకుఁడా విడిచిపెడతాడు.
హయగ్రీవ అవతారం
శ్రీ మహావిష్ణువు విజయ గాధా పరంపరలలో హయగ్రీవ అవతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెపుతుంటారు.పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు.అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుఱ్ఱపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు.ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది.ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పుతిప్పలు పెడుతుండేవాడు.విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్ర భాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు.అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు.అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన.అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది.దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు.బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుఱ్ఱపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది.దేవతలు అలాగే చేశారు.ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు.ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ.ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు.దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది.అందుకే శ్రావణ పూర్ణిమ నాడు ‘హయగ్రీవ జయంతి’ కూడా జరపడం కనిపిస్తుంది.
పైన చెప్పుకున్న కథల్లోని భావన తెలుసుకున్నచో సమాజములో స్త్రీ లను గౌరవంగా భావిస్తూ సమాజంలో సోదరి, సోదరుల మధ్య అనురాగం అనుబంధాన్ని పెంచేందుకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించాలనే భావన కలిగిస్తుంది.
సర్వే జనాః సుఖినోభవంతు
బాచిమంచి చంద్రశేఖర్,
రొంపిచర్ల రఘురామచక్రవర్తి.