తెలంగాణ మలిదశ తొలి అమరుడు శ్రీకాంత చారి వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ నాయకులు రామన్న మాదిగ, హరీష్ యాదవ్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నేడు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా హరీష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రావటానికి ప్రజల్లో స్ఫూర్తినిచ్చిన ఉద్యమ వీరుడు శ్రీకాంత చారి అని, అయితే అలాంటి వీరుడిని తెలంగాణ ప్రభుత్వం మరచిపోయిందని అన్నారు.
కనీసం ఆయన వర్ధంతిని అధికారికంగా నిర్వహించడానికి కూడా తెలంగాణ సిఎం కేసీఆర్ కు మనుసు రావటం లేదా అని ఆయన ప్రశ్నించారు. దొంగ దీక్ష చేసిన రోజుకు దీక్ష దివస్ పేరుతో పాలాభిషేకాలు చేస్తున్న గులాబీలు తెలంగాణ కోసం ఆత్మర్పణం చేసుకున్న శ్రీకాంత చారి చనిపోయిన రోజును ఎందుకు జరుపరని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమం తారాస్థాయికి చేరిన రోజున అమరుల స్థూపం నేడు మూగబోయి చూస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ రాష్టంలో నీళ్లు ఎదురెక్కినై, నిధులు గడికి మల్లినాయ్, నియామకాలు ఆ కుటుంబం పాలైనాయి అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనంతరం రామన్న మాదిగ మాట్లాడుతూ 12,000 బడులు మూసి వీధికొక్క బారు తెరిస్తే రాష్టం ఏ విధంగా అభివృద్ధి చెందుతదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామన్నా మాదిగ, TSU ఇంచార్జ్ రమేష్ నాయక్, సైదులు, భీమేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.