పొరుగు రాష్ట్ర ఉద్యోగస్తుడైనా తమ వాడే అంటున్న సిబ్బంది: హేట్సాప్ చెబుతున్న సత్యం న్యూస్.నెట్
ఏపీఎస్పీ 5వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ, అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందిన ఎపిఎస్పీ హెడ్ కాని స్టేబులు ఎన్. శ్రీనివాసరావు (జి.నెం. 961) కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకొనేందుకు,2000 బ్యాచ్ కు చెందిన సహచర ఉద్యోగులు “చేయూత”ను అందించారు.
ఈ మేరకు మ సహెూద్యోగి కుటుంబాన్ని, వారి పిల్లలను ఆర్ధికంగా ఆదుకోవాలని నిర్ణయించుకొని, వారి జీతాల నుండి లక్ష రూపాయలు ప్రోగు చేసారు. సదరు మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా అదనపుఎస్పీ పి. సత్యన్నారాయణరావు చేతుల మీదుగా మృతి చెందిన ఎన్. శ్రీనివాసరావు సతీమణి కళ్యాణికి అందజేసారు.
వివరాల్లోకి వెళ్ళితే.. ఉమ్మడి ఏపీలో లోని అదిలాబాద్ జిల్లాలో ఏపీఎస్పీ 13వ బెటాలియన్ కానిస్టేబులుగా 2000వ ఏడాదిలో ఎంపికైన ఎన్.శ్రీనివాసరావు 2009వ సం. లో విజయనగరం జిల్లా ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కు బదిలీపై వచ్చారు. 5వ బెటాలియన్ లో విధులునిర్వహిస్తూ, హెడ్ కానిస్టేబులుగా ఉద్యోగోన్నతి పొందిన శ్రీనివాసరావు గత కొంత కాలంగా లివర్ క్యాన్సర్ తో బాధ పడుతుడుతూ, చికిత్స పొందుతూ ఈ ఏడాది జనవరి 07 మృతి చెందారు.
మృతి చెందిన ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబులు ఎన్.శ్రీనివాసరావుతోపాటు 2000 బ్యాచ్ కు చెందిన 13వ బెటాలియన్, అదిలాబాద్ మరియు 5వ బెటాలియన్ కానిస్టేబుళ్ళు వారి కుటుంబానికి అండగా నిలవాలని భావించి, తమతో పని చేసిన సహోద్యోగి కుటుంబాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చారు.
తమ ఉదారతను చాటుకుంటూ, మిగిలిన పోలీసులకు స్ఫూర్తిగా నిలిచిన 2000వ బ్యాచ్ విజయనగరం, అదిలాబాద్ ఏపీఎస్పీ కానిస్టేబుళ్ళును జిల్లా అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎల్విన్ పేట సిఐ టి.వి. తిరుపతిరావు, వెల్ఫేర్ ఆర్ఐ శ్రీరాములు 2000 బ్యాచ్ ఎఆర్ కానిస్టేబుళ్ళు జి.సురేష్ కుమార్, టి. కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం