గరుడ వారధి ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ కి”ఫేషియో ప్యానల్” కు ప్లాస్టింగ్ చేయకుండా వదిలేయడంతో పైనుంచి రోడ్డుపై పెచ్చులు వూడి పడతాయేమో అన్న భయంతో తిరుపతి నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ లో పిల్లర్ టు పిల్లర్ 40 మీటర్లు ఉంటుంది అక్కడక్కడ మధ్య గ్యాప్ లో ఏర్పాటు చేసిన ఫేషియో ప్యానల్ కు ప్లాస్టింగ్ చేయకుండా వదిలేశారని ఆయన అన్నారు.
DBR రోడ్డు ఎంట్రన్స్ లో గతంలో జాకీ పక్కకు జరగడంతో ఫ్లైఓవర్ ఒరిగిపోయింది. దైవానుగ్రహంతో ఎటువంటి ప్రాణం నష్టం జరగలేదు. అలాంటివి పునరావృతం కాకుండా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఆయన కోరారు. శ్రీనివాస సేతుపై కనబడుతున్న ఫేషియో ప్యానెల్ క్రాక్ కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని,జరగదని నగర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులపై ఉందని ఆయన అన్నారు.
శ్రీనివాస సేతు పనులను కపిల తీర్థం నుంచి లక్ష్మీపురం సర్కిల్ మీదుగా మార్కెట్ యార్డ్ వరకు సంపూర్ణంగా పూర్తి చేసి ప్రారంభించి ఉంటే సకాలంలో పనులు పూర్తయ్యేవని ఆయన అన్నారు. అలాకాకుండా విష్ణు నివాసం నుంచి కపిల్ తీర్థం వరకు ఒకసారి ప్రారంభోత్సవం, కపిలతీర్థం నుంచి లీలామహల్ మీదుగా మంగళం రోడ్డుకు మరో ప్రారంభోత్సవం చేయడం కారణంగా కాంట్రాక్టర్ పనులను సకాలంలో సంపూర్ణంగా పూర్తి చేయలేకపోతున్నారని ఆయన తెలిపారు.
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పనులకు టిటిడి ఎక్కువ శాతం నిధులు కేటాయిస్తున్నందున టీటీడీ “క్వాలిటీ కంట్రోల్” వింగ్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి సివిల్ ఇంజనీరింగ్ ల్యాబ్ టెస్టులు నిర్వహించి నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చూడాల్సిన బాధ్యత టిటిడి పై ఉందని ఆయన తెలిపారు. శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పనులు సంపూర్ణంగా పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.