పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిన ప్రాంతంలో స్టాప్ లాక్ ఏర్పాటుకు నీటిపారుదలశాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. జలాశయంలోని నీటిని దిగువకు వదిలి నీటి మట్టం తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంది.
ప్రస్తుతం పులిచింతల జలాశయంలో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి లక్ష్యా 67వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి చేరుతోంది. 19 గేట్లు ఎత్తి 4.95లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విరిగిన గేటు మరమ్మతు పనులు ప్రారంభించాలంటే జలాశయంలో మరో 10 టీఎంసీలు ఖాళీ చేయాల్సి ఉంది.
ఈ ప్రక్రియ మధ్యాహ్నానికి పూర్తికావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు స్టాప్ లాక్ ఏర్పాటుకు సంబంధించిన నిపుణుల బృందం పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకుంది. తాత్కాలిక గేటు ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లను వారు చేసుకుంటున్నారు.
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద
మరోవైపు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ఫ్లో 4.45లక్షల క్యూసెక్కులు.. ఔట్ఫ్లో 4.33 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాల్వలకు 11,858 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.