పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు వైసిపీ నేతలు ప్రయత్నించిన సుబ్బారావు గుప్తా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. వైసీపీ నాయకులను విమర్శించాడనే కోపంతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు సుభానీ నిన్న సుబ్బారావు గుప్తా పై దాడి చేసిన విషయం తెలిసిందే. సుబ్బారావు గుప్తాను అత్యంత దారుణమైన బూతులు తిడుతూ, కొడుతూ మోకాళ్లపై నిలబెట్టి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి క్షమాపణ చెప్పించాడు.
సుబ్బారావు గుప్తాను తన అనుచరులు కొడుతుంటే ఆపానని మంత్రి చెప్పినా ఆ మేరకు ఎక్కడా రుజువులు లేవు. సుభానీ దాడి చేసి కొడుతుండటం మాత్రమే వీడియోలు విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ నాయకుల పనితీరుపై సుబ్బారావు గుప్తా విమర్శలు చేసిన వెంటనే ఆయన ఇంటిపై దాడి జరిగింది. దానికి భయపడిన సుబ్బారావు గుప్తా ఒక హోటల్ లో దాక్కున్నాడు.
గుప్తా ఎక్కడ దాక్కున్నది ఆయన సెల్ ఫోన్ ట్రాకింగ్ ద్వారా కనుక్కున్న ఒక స్థానిక పోలీసు అధికారి సుభానీని తీసుకువెళ్లి ఆ హోటల్ చూపించారని కూడా సమాచారం బయటకు వచ్చింది. సుబ్బారావు పై సుభానీ దాడి చేస్తున్నప్పుడు ఆ పోలీసు అధికారి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఇంత జరిగిన తర్వాత సుబ్బారావు గుప్తాకు మతిస్థిమితం లేదని మంత్రి చెప్పారు.
అయితే ఒంగోలు వైసిపి నేత సుబ్బారావు గుప్తా మంగళవారం ఉదయం బాలినేని పక్కన ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలిసి ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై జగన్, జై బాలినేని అంటూ నినాదాలు చేశారు. గుప్తా పై మంత్రి వాసు అనుచరుడు సుభానీ దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో రాత్రికి రాత్రే బాలినేని అతడ్ని పిలిపించుకొని బుజ్జగించి తనవెంట తిప్పుకుంటున్నట్లు కనిపిస్తోంది.
నిజానికి గుప్తాపై దాడి వ్యవహారంలో ఆర్యవైశ్య సంఘాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిధ్ధమయ్యాయి. పరిస్థితి చేయి జారిపోయే సూచనలు కనిపించడంతో మంత్రి వాసు అలర్ట్ అయ్యారు. రాత్రికి రాత్రే సుబ్బారావుతో రాజీ చేసుకున్నారు. అదీ కథ. మతి స్థిమితం లేదని చెప్పిన మంత్రే ఆయనను పిలిచి రాజీ చేసుకోవడం విశేషం.