ఎగువన ఉన్న కర్ణాటక తుంగభద్ర డ్యామ్ వరద ప్రవాహంతో నిండిన కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ ను ఈ మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పరిశీలించారు. సుంకేసుల డ్యామ్ కు 24,200 ల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో వస్తున్నది.
సుంకేసుల డ్యామ్ 6 క్రెష్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తి 22,000 ల క్యూసెక్కుల వరద నీటిని దిగువన తుంగభద్ర నదిలో వదిలినట్లు కలెక్టర్ వీరపాండియన్ కు ఇరిగేషన్ ఎస్ఈ శ్రీరామచంద్ర మూర్తి వివరించారు. సుంకేసుల డ్యామ్ నుండి తుంగభద్ర నదిలోకి వరద నీరు వదిలినందున ఎవరూ నదిలోకి దిగవద్దని, నదిలో చేపలు పట్టవద్దని కలెక్టర్ ప్రజలకు సూచించారు.
సుంకేసుల డ్యామ్ వద్ద సందర్శకులను అనుమతించ వద్దని, అన్ని భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రవాహాన్ని బట్టి నదీ తీరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండమని తెలపండని ఆయన ఆదేశించారు.
ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, ఫిషరీస్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశించారు. అలాగే శ్రీశైలం డ్యామ్ తో పాటు జిల్లాలో ఉన్న అన్ని డ్యాములు, రిజర్వాయర్లు, నదీ తీర ప్రాంతాలలో వరద ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి అవసరం వచ్చినా తక్షణమే స్పందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఉదారంగా ఆదుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, ఫిషరీస్, మెడికల్, విపత్తు నిర్వహణ శాఖల అధికారులను ఆయన ఆదేశించారు.