దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం, మరోవైపు దక్షిణ ఒడిశా మీదుగా విస్తరించిన ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. రుతుపవన ద్రోణి కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించింది.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తాలో అనేకచోట్ల,రాయలసీమలో పలుచోట్ల కురుస్తోన్న ఉరుములు, పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఇవాళ సాయంత్రంలోగా అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి.
వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులూ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాలు కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీగా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
సముద్రం అల్లకల్లోలంగా మారినందున తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 27వ తేదీ వరకు చేపలవేటకు వెళ్లరాదని పేర్కొన్న విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.