ప్రపంచంలో కరోనా వల్ల ప్రజలు చనిపోతున్నారు. కామారెడ్డి జిల్లాలో మాత్రం కల్లు లేక ప్రజలు చనిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గత నాలుగు రోజులుగా కల్లు దుకాణాలు పూర్తిగా మూసి ఉండటంతో కల్లు ప్రియులు వింతగా ప్రవర్తిస్తున్నారు.
కల్తీ కల్లుకు బానిసలుగా మారిన ప్రజలు కల్లు లేక గిలాగిలా కొట్టుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో కల్లు బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం ప్రతి రోజు 5 నుంచి ఆరుగురు కల్లు బాధితులు వస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
దేశంలో కరోన విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలో కల్లు కొరత కల్లు ప్రియులను ఆగం చేస్తుంది. లాక్ డౌన్ నేపథ్యంలో వైన్స్, కల్లు దుకాణాలను ప్రభుత్వం మూసివేయడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి రోజు కల్లు తాగే అలవాటు ఉన్న ప్రజలకు గత నాలుగు రోజులుగా కల్లు దొరకకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు.
వింతగా మాట్లాడుతున్నారు. ఫిట్స్ వచ్చి పడిపోయి తలలు పగలగొట్టుకుంటున్నారు. ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సలు చేయిస్తున్నారు. ప్రతి రోజు 5 నుంచి ఆరుగురు కల్లు బాధితులు జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వస్తున్నారని మానసిక వైద్య నిపుణులు డా. రాజేందర్ తెలిపారు. ఇప్పటి వరకు చికిత్సలు నిర్వహించిన బాధితులకు హాస్పిటల్ లో చేర్చుకునే పరిస్థితి రాలేదని తెలిపారు