రాపిడ్ టెస్టింగ్ కిట్స్ వ్యవహారంలో ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఎం కె స్టాలిన్ అన్నారు. ఎన్ని కిట్లకు ఆర్డర్ ఇచ్చారో, రేటు ఎంతో చెప్పకుండానే తమిళనాడు ప్రభుత్వం రాపిడ్ టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ ఇచ్చేసినట్లు అవి తొలి విడత వచ్చేసినట్లు చెబుతున్నదని ఆయన అన్నారు.
ఛత్తీస్ గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టి ఎస్ సింగ్ దేవ్ ఎంతో పారదర్శకంగా అన్ని విషయాలు వెల్లడిస్తుంటే తమిళనాడులోని ఏఐఏడిఎంకె ప్రభుత్వం మాత్రం ఎంతో గుంభనంగా వ్యవహరిస్తున్నదని ఆయన అన్నారు. 75 వేల రాపిడ్ టెస్టింగ్ కిట్లను రూ.337 ప్లస్ జీఎస్ టి కి కొనుగోలు చేసినట్లు ఛత్తీస్ గఢ్ మంత్రి వెల్లడించారని స్టాలిన్ తెలిపారు.
అయితే తమిళనాడు ప్రభుత్వం మాత్రం భారత్ లో కార్యాలయం ఉన్న దక్షిణ కొరియా కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చి కూడా రేటు ఎంతో చెప్పడంలేదని ఆయన అన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లాగానే రాపిడ్ టెస్టు కిట్లను ఎస్.డి.బయో సెన్సర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక్కొక్కటి రూ.600 చొప్పున కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రూ.730కి కొనుగోలు చేసింది.