క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి అన్ని విధాలుగా సమష్టి కృషి చేస్తున్నామని విజయనగరం జిల్లా టీబీ కంట్రోల్ అధికారి డా. టి. రాణీ సంయుక్త అన్నారు. జిల్లా ప్రజల్లో వ్యాధిపై అవగాహన కల్పిస్తూ, పలు విధాలుగా చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక సర్వేలు నిర్వహించటం ద్వారా ఉత్తమ సేవలందించారని వెల్లడించారు.
ఈ నెల 24 ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించబోయే కార్యక్రమాల గురించి స్థానిక టీబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు..కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి 2025 నాటికి క్షయ వ్యాధి లేని సమాజాన్ని నిర్మించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.గడచిన మూడేళ్ల అంటే 2018 నుంచి జిల్లాలో టీబీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు.
గతేడాది అంటే 2022 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు గణంకాలను చూసినట్లయితే కేవలం 690 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు.. వ్యాధి నివారణకు సంబంధించి ప్రతి పీహెచ్సీ పరిధిలో ఒక నోడల్ అధికారిని, అవసరమైన మేరకు మందులను అందుబాటులో ఉంచామని చెప్పారు. జిల్లాలో చేపట్టిన చర్యలపై ఇటీవల కేంద్ర టీబీ డివిజన్ పరిధిలో ప్రత్యేక సర్వే నిర్వహించగా రాష్ట్రంలోనే జిల్లా మెరుగైన పనితీరు కనబరిచిందని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించినందుకు గాను కాంస్య పతకం కూడా అందుకున్నామని వివరించారు. ఇదే విధంగా వైద్య సేవలను అందిస్తూ 2025 నాటికి ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాని విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
క్షయ నివారణపై నగరంలో 24న అవగాహన ర్యాలీ….!
ఈనెల 24 ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరంలో అవగాహన ర్యాలీని చేపడుతోంది….టీబీ నివారణ శాఖ. ఈ మేరకు టీబీ కంట్రోల్ అధికారి డా. టి. రాణీ సంయుక్త మాట్లాడుతూ. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం వరకు ఈ ర్యాలీ ఉంటుందని తెలిపారు.ఈ ర్యాలీలో జాయింట్ కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.
అనంతరం స్థానిక డీఎం అండ్ హెచ్వో కార్యాలయంలో సమావేశం జరుగుతుందని వివరించారు. జిల్లాలోని 14 వైద్య బృందాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రపంచ క్షయ వ్యాధి నివారణా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రాలు అందజేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. డా. వి. ఉదయ్ కుమార్, ఇతర వైద్యులు, టీబీ ఆసుపత్రి సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.