తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అదుపు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ కు నేడు ఫిర్యాదు చేసింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, నన్నూరి నర్సిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, కొత్తకోట దయాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పాలనలో మహిళల జీవితాలు గాలిలో దీపంలా మారిపోయాయని అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉందని వారు గవర్నర్ కు తెలిపారు. సిరిసిల్లా లోని ఎస్సీ హాస్టల్ లో విద్యార్ధినిలపై అధికార పార్టీకి చెందిన నేతలు లైంగిక వేధింపులకు పాల్పడటం, గజ్వేల్ లో బ్యాంకు ఉద్యోగిని హత్య, కరీంనగర్ లో ఇంటర్ విద్యార్ధి హత్య, బల్కంపేట్ లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం గత రెండు వారాలలో జరిగిన దురదృష్టకర సంఘటనలని వారు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సంఘటనలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి దోషులకు కఠిన శిక్షలు పడే విధంగా ప్రయత్నించాలని వారు కోరారు. ఎన్నికలకు మందుకు టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్ రూం ఇళ్ల పైనా, దళితులకు భూమి పైనా హామీలు గుప్పించిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలు పట్టించుకోవడం మానేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట కూడా తప్పిందని తెలుగుదేశం పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.