తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు దేశానికే ఆదర్శంగా తయారవుతున్నాయని, పల్లె ప్రగతి ద్వారా పరిశుభ్రత, పచ్చదనంతో విలసిల్లుతూ, స్వయం సమృద్ధి ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామంలో వైకుంఠదామం, పల్లె ప్రకృతి వనంను ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ప్రతి గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి ప్రతి గ్రామ పంచాయతికి ప్రభుత్వం నేరుగా నెల, నెల నిధులు అందిస్తున్నదని అన్నారు.
గతంలో గ్రామంలో మౌలిక వసతులు లక్ష రూపాయలు కావాలంటే మంత్రులను కలిసి కోరిన సందర్భాలు ఉండేవని, కానీ నేడు సీఎం కేసిఆర్ అడగకుండానే గ్రామాలకు పల్లె ప్రగతి కోసం రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రతి నెల 369 కోట్ల రూపాయలను నేరుగా ఇస్తూ వాటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు.ప్రతి గ్రామంలో ట్యాంకర్లు, ట్రాలీలు, ట్రాక్టర్లు ఇచ్చి ఆ గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనం గా ఉండేలా చేస్తున్నారన్నారు.
చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాలు గౌరవంగా జరగాలని అందుకోసం ప్రతి గ్రామంలో వైకుంఠ దామాలు నిర్మిస్తున్నారని, కలిగిన వాళ్ళు వారి స్థలాల్లో అంతిమ సంస్కారాలు చేస్తుంటే పేద వాళ్లకు కనీసం దహనం చేసే స్థలాలు లేక పడే ఇబ్బందులు గుర్తించి సీఎం కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంక్షేమం అమలు చేస్తున్న సీఎం లేరన్నారు.
గ్రామాల్లో చెరువుల పూడిక తీసే నాధుడే లేక చెరువులు ఆక్రమణకు గురి అవుతున్న తరుణంలో కేసీఆర్ దృఢ సంకల్పంతో మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు అభివృద్ధి చేసి వారిని సంరక్షించి గ్రామాలకు జల బండగరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని ఇవ్వడం వల్ల, కలుషిత నీటి ద్వారా వచ్చే అనేక వ్యాధులు చాలా వరకు దూరం అయ్యాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో కరెంట్ స్తంభాలు ఒక నియంత్రిత పద్దతిలో వేస్తూ నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని పేర్కొన్నారు.
సి ఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి పల్లె ప్రగతి కార్యక్రమం దళితవాడలలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.