అనేక నూతన పథకాలతో చేనేత పరిశ్రమకు టీఆరెస్ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
మొదటగా ఆయన జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కో రంగాన్ని టీఆరెస్ ప్రభుత్వం బలోపేతం చేస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉపాధిరంగంగా ఉన్న చేనేత పరిశ్రమను ప్రగతి బాటలో నడిపేందుకు మంత్రివర్యులు కేటీఆర్ విశేషమైన కృషి చేస్తున్నారని, ఈ ఏడాది బడ్జెట్ లో నేతన్నకు చేయూత పథకానికి ప్రభుత్వం 338 కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పింఛన్లు అందించే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. 50 లక్షల రూపాయలతో మంజూరైన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని,వాటికి అవసరమైన అదనపు నిధులను కూడా మంజూరు చేయించి నిర్మాణ పనులను చేపడుతామని హామీ ఇచ్చారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు చేనేత వస్త్రాలను ధరించాలనిచ్చిన పిలుపుతో రాష్ట్రంలో చేనేత వస్త్ర దుకాణాలు కళకళలాడుతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీను, చేనేత సంఘం నాయకులు చిలుకూరు లక్ష్మీనర్సయ్య, పొట్టబత్తుల వెంకటేశం, పెండెం సదానందం, చిలుకూరు జనార్దన్, గుర్రం అంతయ్య తదితరులు పాల్గొన్నారు.