మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా పోలీసు అధికారులు బాగా పని చేస్తున్నారని, నేర నియంత్రణలో, నేరస్తులను పట్టుకోవడం లో, రోడ్ ఆక్సిడెంట్ నివారించటంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర డిజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అలాగే మావోయిస్టు కదలికలు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ వారు ఈ ఏరియా లో ఎక్కడా సంచరించకుండా, ఒకవేళ వస్తే వారిపై కటినమైన చర్యలు తీసుకునేలా ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు.
మావోయిస్టు ప్రభావిత జిల్లాలలో పర్యటన లో భాగంగా రామగుండం కమీషనరేట్ ను ఆయన సందర్శించారు. ఆ తర్వాత ఎన్టీపీసీ లోని మిలీనియం హాల్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. పీపుల్ ఫ్రెండ్లీ వాతావరణంలో నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసి ఒక పార్టనర్ షిప్ మోడ్ లో పోలీసింగ్ చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని డిజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. నేర నిరోధం, నేరస్తులను పట్టుకోవడం, నేరస్తులకు శిక్ష పడేలా చేయడం పోలీసింగ్ లో ముఖ్య భాగాలని ఆయన అన్నారు.
అదే విధంగా ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పర్యవేక్షణ అలాగే మావోయిస్టు కదలికలు ఇంటర్ స్టేట్ బార్డర్స్ పై నిఘా ప్రధాన అంశాలని అన్నారు. తెలంగాణ సిఎం కేసీఆర్ పోలీస్ శాఖను ఆధునీకరించడం, ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయడం అనే అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడంతో మరింత మంచి ఫలితాలు వచ్చాయని డిజీపీ అన్నారు.