రాష్ట్రంలో కరోనా లేదని, వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని పేరాసిట మాల్ మాత్రతో, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా నిరోధించవచ్చునని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదని ఆయన గట్టిగా చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో బాటు పలువురు మంత్రులు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై విరుచుకు పడ్డారు. ఆయన కులంతో సహా దుమ్మెత్తిపోశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అయితే మరొక అడుగు ముందుకు వేసి స్థాయి కూడా మరిచి ఆయనను వ్యక్తిగతంగా విమర్శించారు.
ఇది ఇలా ఉండగా కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి ముఖ్యమంత్రి కరోనా లేదని చెప్పినా మంగళవారం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల రివ్యూ మీటింగ్ లో చుట్టూ పదుల సంఖ్యలో అధికారులు, వైసీపీ కార్యకర్తలు ఉన్నా కరోనా భయంతో ముందస్తుగా మూతికి ఆయన ఒక్కరే మాస్క్ ధరించి వచ్చారు.
కరోనా లేదని ముఖ్యమంత్రి చెబుతున్నా ఎమ్మెల్యే ఇలా రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఆయనకే అలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సామాన్యుల పరిస్థితి ఏంటని గుసగుస లాడారు. కాగా కరోనా భయం తో ఏప్రిల్ 7వ తేది ఒంటిమిట్ట లో జరగనున్న సీతారాముల కల్యాణం వేలాది మంది భక్తుల మధ్య కాకుండా, పరిమిత సంఖ్యలో ఆలయ ప్రాంగణంలో చేయాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.
మరి దేవునికి వర్తించిన కరోనా నిబంధనలు ఎన్నికల రద్దుకు వర్తించవా అని భక్తులు చర్చించు కోవడం కొసమెరుపు.