“అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చేస్తున్నారు” అని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి అరవింద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి హిందువు భగవద్గీతను చదవాలని, ఒకసారి భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మతం మారే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని కోఠీ విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని అరవింద రావు నేడు సందర్శించారు. జీవితంలో మొట్టమొదటి సారి విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కాలు పెట్టానని, చాలా సంతోషంగా ఉందని అన్నారు.
కులాల ప్రస్తావనతో హిందువుల విభజన
ఓవైపు ముస్లిం లు, మరోవైపు క్రైస్తవులు ప్రపంచాన్నంతా తమ తమ మతంతో నింపి వేయాలని పోటీపడి పనిచేస్తున్నారని ఉదాహరణలతో వివరించారు. హైందవ జీవన విధానాన్ని అణువణువునా వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు భావితరాల మెదళ్ళలో విషం నింపుతున్నాయని చెప్పారు.
హిందుత్వంలో ఎక్కడ కూడా కులాల మధ్య తారతమ్యాలు కనిపించవని, కానీ ఒక్కటిగా ఉన్న హిందువులను విభజించేందుకు కులాల ప్రస్తావన తీసుకువచ్చి చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి దగ్గర హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి, వలలో వేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అహింస, నైతికత తోనే హిందుత్వం
హింస, అనైతికం ఆధారంగా ఇతర మతాలు పనిచేస్తున్నాయని.. అహింస, నైతికత పేరుతోనే హిందుత్వం పనిచేస్తుందని అరవింద రావు చెప్పారు. ఒక మతాన్ని నాశనం చేసి, తమ మతమే గొప్పది అని చెప్పుకునే వాళ్లే దాడులకు తెగబడుతున్నారని వివరించారు. శాంతి, అహింస, నీతి, విశ్వాసం అనేవి హిందుత్వానికి మూలాధారాలు అన్నారు. హిందువులలో ఎందరో దేవుళ్ళు ఉన్నా కూడా, అందరినీ సమన్వయపరుస్తూ వారి వారి పద్ధతులతో, ఆరాధిస్తూ పూజించడం గొప్ప విషయమన్నారు.
ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలి
ప్రతి హిందువు భగవద్గీత, రామాయణం తో పాటు చరిత్రను ఇతర విషయాలను తప్పకుండా అవగాహన పరుచుకోవాలి, అందుకు అధ్యయనం తప్పనిసరి అని మాజీ డిజిపి సూచించారు. వ్యక్తికి శారీరక దృఢత్వం ఎంత అవసరమో, అంతకుమించి మానసిక శక్తి ..బుద్ధిబలం కూడా అవసరమేనన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపై శ్రద్ధగా అధ్యయనం చేయాలని, తద్వారా ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలని సూచించారు. ఎదుటివారిని కట్టడి చేసే టప్పుడు నీళ్ళు నమలకుండా జవాబు అందివ్వాలని చెప్పారు.
యథేచ్ఛగా చరిత్ర వక్రీకరణ
నేడు పాఠ్యాంశాల్లో ఔరంగజేబు గొప్పతనం గురించి రాస్తున్నారని, టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ పాఠ్యాంశాలు ముద్రిస్తున్నారని అరవింద రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా 1590 లోనే గోవాలో హిందువులపై ఊచకోత ప్రారంభమైందని, కేరళలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయర్ల ను కనుమరుగు చేశారని చెప్పారు.
ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ హిందుత్వాన్ని నాశనం చేసేందుకు రక్తపాతం సృష్టించిన చరిత్ర ముస్లింలు, క్రైస్తవుల దేనని పేర్కొన్నారు. కానీ నేడు వాస్తవాన్ని వక్రీకరించి అదే టిప్పుసుల్తాన్ ను, ఔరంగజేబును కీర్తిస్తూ పాఠ్యాంశాలు రావడం వల్ల భావితరాలు వాస్తవాన్ని తెలుసుకొని లేక పోతున్నాయని పేర్కొన్నారు.
కమ్యూనిస్టుల ఎజెండా “ఎడిట్- ప్రాప్ “
ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ సాధించలేకపోతే “ఎడిట్ – ప్రప్” సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరవింద్ రావు చెప్పారు. ఎడిట్ ప్రాపు అంటే కమ్యూనిస్టులు అవలంబించే సిద్ధాంతమని.. ఒక విషయాన్ని శ్రద్ధగా చదివి దానిపై అవగాహన పెంచుకోవడం.
అదేవిధంగా వాస్తవాన్ని అవాస్తవంగా ప్రాపగాండా చేయడం కమ్యూనిస్టుల ముఖ్యలక్షణం అని చెప్పారు.(Education & Propaganda ). భవిష్యత్తులో హిందుత్వంపై విపరీతమైన దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని, అందుకు దాడులను ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు హిందూ సమాజం సంపాదించాలని ఆయన కోరారు.
అంతకుముందు విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్ అరవింద్ రావును మర్యాదపూర్వకంగా కార్యాలయంలోకి ఆహ్వానించారు. మెడలో కాషాయపు కండువా వేసి ఆత్మీయంగా సత్కరించారు. అనంతరం విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ సహ కార్యదర్శి సత్యం జి మాట్లాడుతూ అరవింద రావు ఎక్కడున్నా హైందవ అభివృద్ధి కోసమే తపిస్తుంటారని గుర్తు చేశారు.
దాదాపుగా పాతికేళ్ల నుంచి హిందూ సంస్థలతో మమేకమై పని చేయడం గొప్ప విషయమన్నారు. అవకాశాన్ని బట్టి విశ్వహిందూ పరిషత్ కు సమయం ఇవ్వాలని అరవింద్ రావు ను కోరారు.
కార్యక్రమంలో VHP రాష్ట్ర సహ కార్యదర్శులు జగదీశ్వర్ జి, రాజేశ్వర్ రెడ్డి జి, ప్రాంత ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మహా నగర అధ్యక్షులు శ్రీనివాస రాజా జి, బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ సుభాష్ చందర్ జి, కో కన్వీనర్ లు శివరాం జి, కుమారస్వామి జీ, గణేష్ జి, రంజిత్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.