తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ద్వితీయ మహాసభలు జూలై 1, 2, 3 తేదీల్లో సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ పట్టణంలో జరగనున్నాయని సంఘం ప్రదాన కార్యదర్శి పశ్య పద్మ తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
మహాసభలకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సోమవారం హైదరాబాద్, హిమాయత్ నగర్, అమృత ఎస్టేట్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం పేద రైతు సర్వవోలు నారాయణ, పశ్య పద్మలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ జూలై 1వ తేదీన రైతుల భారీ ప్రదర్శన అనంతరం బహిరంగ సభ హుజూర్ నగర్ పట్టణంలో జరుగుతుందన్నారు.
జూలై 2వ తేదీన మహాసభలు ప్రారంభమౌతాయని, ఈ సభకు ఎఐకెఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావుల వెంకయ్య, అతుల్ కుమార్ అంజన్ పాల్గొంటారని చెప్పారు.ఈ సభలను ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ అంజాన్ ప్రారంభిస్తారని, 3వ తేదీన రైతులకు పంటల భీమా ఆవశ్యకత, ప్రభుత్వ పథకాల అమలుపై సెమినార్ జరుగుతుందని, ఈ సెమినార్ లో మాజీ ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త ఇక్రిసాట్ డా. .కిలారు పూర్ణచందర్, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, డీన్, ప్రొఫెసర్ ఎం.వి.రమణమూర్తి, మాజీ ప్రధాన జన్యుశాస్త్రం శాస్త్రవేత్త, ఐసిఏఆ,ర్ డా. సోమ మర్ల హాజరవుతున్నారు.
రాష్ట్ర నలుమూలల నుండి ప్రతినిధులు, సౌహార్థ ప్రతినిధులు హాజరవుతారు. కౌలు, పాల, మహిళా రైతులు పాల్గొంటున్నారని పశ్య పద్మ తెలిపారు. వ్యవసాయ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగి పోవడంతో ఖర్చులు మొత్తాన్ని రాబట్టు కోలేని దుస్థితి ఏర్పడిందని, పంటలు పండించిన రైతులకు కనీసం సాగు ఖర్చులు – కుటుంబ పోషణ ఖర్చులు లభించక మార్కెట్ మాయాజాలంపై పోరు సాగిస్తున్నారని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల రైతాంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటుందని, సాగును చిన్న – సన్న- మధ్యతరగతి రైతుల, కౌలు రైతుల నుండి తీసుకొని మార్కెట్లను, పంపిణీని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ఆలోచనతో 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందన్నారు.
దీనితో ఆగ్రహించిన లక్షలాది మంది రైతులు సాగు చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని, అన్ని పంటలకు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం శాస్త్రీయమైన గ్యారెంటీతో కూడిన మద్దతు ధరలు చెల్లించాలని, ఢిల్లీ సరిహద్దులలో ఏడాదిన్నర కాలం పైగా తీవ్రమైన అనిచివేతను ఎదుర్కొని మడమ తిప్పని పోరాటం చేశారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దులలో రైతాంగం సాగించిన పోరాటాల స్ఫూర్తితో ఐక్యంగా రైతాంగం పాలకుల వాగ్దానాల అమలుకు పోరాటం చేయాల్సి ఉందన్నారు. జూలై 1, 2, 3 తేదీల్లో ప్రజా రైతు ఉద్యమాలకు పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని రైతులను కోరారు.