మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ర్యాలీ ఉద్రిక్తతకు చోటుచేసుకుంది. రెండు గంటలుగా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు డిఎస్పీ సోమనాథం వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించడంతో రైతులు ఒక్కసారిగా డిఎస్పీపై ఫైర్ అయ్యారు. నిన్న రైతు రాములు మృతదేహాన్ని అడ్డుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించి రైతులకు తెలియకుండా మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించిన డిఎస్పీ మాట్లాడటానికి వీల్లేదన్నారు.
డిఎస్పీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తర్వాత అడిషనల్ ఎస్పీ అన్యోన్య వచ్చి నలుగురు మాత్రమే లోపలికి వచ్చి వినతిపత్రం ఇవ్వాలని సూచించగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై అడిషనల్ ఎస్పీ దురుసుగా మాట్లాడటంతో రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాంతో పోలీసులను, బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లి ప్రయత్నం చేయగా పోలీసులు రైతులను నివారించేందుకు ప్రయత్నించారు.
అయినా రైతులు వినకుండా డిఎస్పీ, అడిషనల్ ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బారికేడ్లను ఎత్తిపడేసి కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ గేటు బద్దలు గొట్టి రైతులు కలెక్టరేట్ లోపలికి వెళ్లే అవకాశం ఉండటంతో పోలీసులు ముళ్ళకంచే ఏర్పాటు చేశారు.