సహజమైన అటవీ ప్రాంతంలో కొండలు, గుట్టల మధ్య వెలసిన కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంగా పునర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆలయానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున దత్తత తీసుకుని అభివృద్ది చేస్తామని సీఎం పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ గతంలో ప్రకటించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకుని, ఆరో యేట అడుగు పెడుతున్న సందర్భంగా కొండగట్టు ఆలయాన్ని దర్శించుకుని, అటవీ అభివృద్ది పనులకు ఎంపీ శ్రీకారం చుట్టారు. తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం 1,094 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా, ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో పనులను ప్రారంభించారు. జే.ఎన్.టీ.యు విద్యార్థులతో కలిసి వెయ్యి మొక్కలు నాటారు.
కొండగట్టును సందర్శించే భక్తులు సేదతీరేందుకు వీలుగా అహ్లాదకరమైన వాతావరణంలో ఫారెస్ట్ పార్క్ ను తీర్చిదిద్దుతామని, మిగతా అటవీ ప్రాంతమంతా పునరుద్దరణకు వీలుగా అటవీ శాఖ చేపట్టే చర్యలకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎం.పీ నిధుల నుంచి ఒక కోటీ నాలుగు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలను (104.
85 లక్షలు) కేటాయించారు. అటవీ ప్రాంతానికి రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, గజేబోల నిర్మాణం చేపట్టనున్నారు.
ముఖ్యమంత్రి మానస పుత్రిక తెలంగాణకు హరితహార స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించామని, గత ఐదేళ్లలో పర్యావరణ రక్షణకు, ప్రకృతి పునరుద్దరణకు పాటు పడటం అత్యంత సంతృప్తిని కలిగించిందని ఎం.పీ సంతోష్ కుమార్ అన్నారు. విచ్చల విడిగా పెరిగిన ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, కాలుష్యంపై అవగాహన పెంచటం, పలు కార్యక్రమాలను చేపట్టడం ఆరో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రాధాన్యతగా పెట్టుకున్నామని ఎం.పీ ప్రకటించారు.
అన్ని రంగాల్లో అభివృద్దితో పాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిస్తున్నారని, కాళేశ్వరం కట్టినా, యాదాద్రి పునర్ నిర్మాణం చేసినా, ఇప్పుడు కోటి మొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ది నిర్ణయమైనా కేసీయార్ దార్శనికతకు నిదర్శనమని సంతోష్ కుమార్ అన్నారు.
దేశానికే ఆదర్శంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్పర్యావరణ స్పృహను ప్రచారం చేస్తూ, అన్నివర్గాల వారితో మొక్కలు నాటిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ ప్రయత్నం దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు. గ్రీన్ ఇండియా తరపున చేపట్టే ప్రతీ ప్రయత్నం దేవుడి ఆశీస్సులతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
సొంత ప్రాంతమైన జగిత్యాల జిల్లాలో, అంజన్న సన్నిధిలో అటవీ దత్తత, అభివృద్ది పనులను చేపట్టిన ఎం.పీ సంతోష్ కుమార్ ను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందించారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ దామోదర్ రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సుంకే రవి శంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, విద్యా సాగర్ రావు, సీఎం సెక్రెటరీ భూపాల్ రెడ్డి, OSD ప్రియాంక వర్గీస్, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, పిసిసిఎఫ్ దొబ్రియాల్, సీసీఎఫ్ శరవణన్, డీ ఎఫ్ ఓ బీవీ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.