ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ అనంతపురంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ డీఎస్పీలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీలను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజపరంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎలా వ్యహరించలి..
అదే విధంగా ప్రజలకు అందించాల్సిన సేవలు.. విధినిర్వహణ పోలీసు వ్యవస్థకు ఉత్తమ సేవలందించడం ద్వారా సమాజం లో మంచి పేరు తీసుకురావచ్చో ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్ధేశం చేశారు. విధి నిర్వహణ లో అంకితభావం, పారదర్శకత, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన కల్గి ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సత్వర న్యాయం చూపాలి.
ఏ మాత్రం జాప్యం చేయకూడదు. సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలి. ప్రజలు సైబర్ నేరస్తుల బారిన పడకుండా అవగాహన చేయడంతో పాటు వాటి నియంత్రణపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా లోన్ యాప్ లతో మోసపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పూస గుచ్చినట్లు వివరించారు. సైబర్ మోసాల అడ్డుకట్ట కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా సైబర్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు.
మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం, పోలీసుశాఖలు కృషి చేస్తున్నాయి. మహిళల రక్షణ కవచంగా దిశ యాప్ పని చేస్తోంది. దిశ కాల్స్ కు సకాలంలో పోలీసులు సత్వరమే స్పందించడం, ఆయా ప్రాంతాలకు వెళ్తుండటం వల్ల చాలా వరకు నేరాలు తగ్గాయి. మహిళా పోలీసులను సమన్వయం చేసుకుని దిశ యాప్ ప్రాధాన్యతను వివరిస్తూ మహిళల మొబైల్ ఫోన్లలో సుమారు 1.22 కోట్లు దిశా యాప్ ను డౌన్లోడ్ చేయించాం.
నేరాలు జరుగకుండా ప్రివెన్సన్ మరియు డిటెక్సన్ ల కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, చట్టాలను ఉపయోగించి నేరాలు తగ్గేందుకు కృషి జరుగుతోందని ఆయన వివరించారు. ప్రతీ పోలీసు ముఖ్యంగా వ్యక్తిగత విషయ పరిజ్ఞానంతో పాటు చట్టాలపై సమగ్ర అవగాహన, విశ్లేషణతత్వం కల్గి ఉండాలి.
పోలీసులుగా ప్రజలకు మరియు సమాజానికి సేవలందించడం కోసం అన్ని విభాగాలు/విషయాలపై పరిజ్ఞానం కల్గి ఉండాలి. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాలి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ప్రజల ప్రాధాన్యత కేసుల్లో సత్వరమే చర్యలు తీసుకున్నాం.
మున్ముందు కూడా కార్యాచరణతో ముందుకెళ్తూ అలసత్వం లేకుండా చట్టపరిధిలో ప్రజలకు శీఘ్ర న్యాయం జరిగేలా కృషి చేయాలి అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఐజిపి వెంకట్రామిరెడ్డి, అప్పా అనంతపురం ప్రిన్సిపాల్ వి.గీతీదేవి, జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.