రాజ్యాధికార సాధన దిశగా తమ సత్తాను చాటేందుకు కాపు కులస్తులు ఏర్పాటు చేసుకున్న సమావేశం కళా విహీనంగా మారడానికి కొందరి అత్యాశే కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయంగా గాలి ఎటు ఉంటే అటు దూకుదామని చూసే కాపు నాయకులే విశాఖపట్నంలో జరిగిన కాపునాడు మహాసభ నిస్తేజంగా సాగడానికి కారణంగా చెబుతున్నారు. అధిక శాతం ఉన్న కాపులు అందరిని (తెలగ,బలిజ,కాపు,ఒంటరి కులాలు) ఏకతాటిపైకి తెచ్చి రాజ్యాధికారం చేపట్టాలనే ముఖ్య ఉద్దేశంతో విశాఖపట్నంలో కాపునాడు నిర్వహించారు.
ఐతే సభకు రాజకీయ రంగు పులిమేశారు. వారు అనుకున్నది వేరు జరిగినది వేరు. దివంగత వంగవీటి మోహన రంగా వర్ధంతి నాడు మంచి సంకల్పం తో కాపునాడు నిర్వహించాలని ముందుగా భావించారు. సభకు ఒక వారం ముందు కాపునాడు పోస్టర్ ను ఆవిష్కరించారు. ముందు మెగాస్టార్ చిరంజీవి తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు. అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దాన్ని అందిపుచ్చుకుని ఆ కార్యక్రమం నిర్వహించేశారు. గంటా శ్రీనివాసరావు గత అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు.
గత కొద్ది కాలంగా ఆయన పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీలోకి ఆయన దూకాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు. అయితే అధికార వైసీపీలో ఇప్పటికే వేళ్లూనుకుని ఉన్న నాయకులు గంటా రాకను అడ్డుకుంటున్నారు. దానికితోడు గంటాకు వైసీపీ అధిష్టానం కూడా కఠినమైన షరతులు పెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. దాంతో ఆయన మళ్లీ తెలుగుదేశంలోనే ఉండాలా? జనసేన వైపు వెళ్లాలా? బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని సందిగ్ధంలో పడిపోయారు. ఈ మూడు పార్టీల పొత్తు ఉంటే తనకు మళ్లీ టిక్కెట్ దక్కేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సహకరిస్తారా అనే అనుమానం కూడా గంటాను వెంటాడుతున్నది.
ఈ నేపథ్యంలో కాపునాడును ఘనంగా నిర్వహించి తనకు తానుగా మళ్లీ డిమాండ్ పెంచుకోవడానికి ఆయన వేదిక సిద్ధం చేసుకున్నారని కాపు నాయకులే అనుకున్నారు. ఏ అవకాశం ఉన్న రాజకీయంగా బాగా వాడుకొనే గంటాను కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. గంటా శ్రీనివాస్ వలనే కాపులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కాపు జాతి కోసం, కాపునాడు కోసం మాట్లాడే నైతిక అర్హత గంటాకు లేదన్నారు. స్వార్ధ రాజకీయం కోసం కాపులని కాపు సంఘాలను అభాసుపాలు చేసి చిన్న భిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా కాపు భవన శంకుస్థాపన చేయడం కాపులకు తీవ్రమైన ద్రోహం చేయడమేనన్నారు.
మూడుముక్కల రాజకీయ క్రీడలో కులాన్ని కాపునాడుని భ్రష్టు పట్టించవద్దని తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. పోనీ పోస్టర్ ఆవిష్కరించిన గంటా సభకు ఏమైనా వెళ్లి మైలేజ్ తెచ్చారా అంటే అదిలేదు.తనకు అనుకూలంగా సభను మలుచుకొని కాపులకు పెద్ద శ్రేయోభిలాషి తానే అనే సంకేతం ఇద్దాం అనుకున్న గంటా కు.. కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు రూపంలో ఎదురు దెబ్బ తగిలిందే అనే చెప్పాలి. కాపునాడు సభలో వారికి నాయకత్వమే శాపమైందనే చేదు నిజం ఈ సభ ద్వారా మరోసారి నిరూపితమైంది. దివంగత వంగవీటి మోహనరంగా వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన కాపునాడు సమావేశం సభకు పేరొందిన కాపు రాజకీయ నాయకులు ఎవరు హాజరు కాలేదు.
బీజేపీ నుండి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాత్రమే కొంచెం పేరు ఉన్న నాయకుడు. అయితే జీవీఎల్ నరసింహారావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. ఇప్పటికే వంగవీటి మోహన రంగాను భౌతికంగా పోగొట్టుకున్నామని, చిరంజీవిని రాజకీయంగా దూరం చేసుకున్నామని వక్తలు ఆవేదన చెందారు. ఇప్పుడు మూడో వాడిని (పవన్కల్యాణ్) కాపాడుకుందామా? పోగొట్టుకుందామా? అనేది మన చేతల్లోనే వుందని వక్తలంతా ముక్త కంఠంతో సభలో చెప్పారు. అన్ని తానై నడిపిద్దాం అనుకున్న గంటా హ్యాండీ ఇచ్చారో.. లేక రాజకీయ రంగు మరక తానకు అంటుకుంటుందో అనో ఆయన సభకు హాజరు కాలేదు.
ఒకవేళ గంట హాజరైతే… వైకాపా, బీజేపీ, టీడీపీ ముఖ్య కాపు నాయకులు కచ్చితంగా వేదిక పంచుకోరని ఇన్ సైడ్ టాక్.. అతిరథమహారథులు వేదిక పంచుకొని తమ వాణి బలంగా వినిపిద్దాం అనుకున్నా వారికి గంటా రూపంలో ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పడంలో సందేహం లేదు. కాపునాడు సభ బ్యానర్లో దివంగత వంగవీటి మోహనరంగాతో మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్కల్యాణ్ ఫొటోలున్నాయి.
సభకు ముఖ్య అతిథిగా జివిఎల్ హాజరై తనదైన శైలి లో ప్రసంగించి కాస్తా ఉపశమనం కలిగించారు. ఇటీవల రాజ్యసభలో కాపుల ఐదు శాతం రిజర్వేషన్పై ప్రశ్నించి, వారి ఆకాంక్షలను అత్యున్నత చట్ట సభలో వినిపించిన జీవీఎల్పై కాపునాడు సభలో ప్రశంసలు వెల్లువెత్తాయి. కాపు నాడులో ప్రత్యేకంగా జీవీఎల్ కృషిని వక్తలు ఆకాశమే హద్దుగా పొగడ్తలతో ముంచెత్తారు. జీవీఎల్కు పాదాభివందనాలని కాపు నేతలు చెప్పడం గమనార్హం. భవిష్యత్లో తమ గళాన్ని రాజ్యసభలో వినిపించాలని కాపు నేతలు జీవీఎల్ను అభ్యర్థించారు.. చివరకి జివిఎల్ కు విన్నపాలు చెప్పుకుంటూ .. సభను ముగించారు.. గొప్ప సంకల్పం తో .. కాపులను ఐక్యతతో నిలిపి.. రాజ్యాధికారమే లక్ష్యంగా ..కాపుజాతి అభివృద్ధే ధ్యేయంగా సభను విజయవంతం చేసుకుందాం అనుకున్న వారికి గంటా రూపంలో అపజయమే అనే చెప్పాలి.
గంట శ్రీనివాస్ గంటకో విధమైన రాజకీయ శైలి తో మైలేజ్ పొందాలని చూసినా ఆయనకు ఏది కలిసిరాలేదని చెప్పాలి. స్టీల్ ప్లంట్ ప్రవేటీకరణ అనగానే రాజీనామా డ్రామా చేసారు.. అది ఫలించలేదు.. విజయవాడ.. హైదరాబాద్ లలో కాపు ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.. ఆ భేటీలు భేటిలాగానే మిగిలిపోయాయి.. చివరకు జగన్ సమక్షంలో ఇదిగో పులి అదిగో పులి అన్నట్టు రేపు చేరిక అన్నట్టు హడావిడి చేశారు.. ఇక ఆయనే నేనే ఏ పార్టీలోకి వెళ్లడం లేదని కథకు ఎండ్ కార్డు ఇచ్చుకొని.. మళ్ళీ కాపునాడు పోస్టర్ ఆవిష్కరణ రోజున మెరిసి ..
సభ రోజున అదృశ్యం అయ్యారు… కాపుల నుంచి రాజకీయ లబ్ది రావడం లేదని ముందే పసిగట్టిన వైసీపీ తూర్పు కాపుల పేరుతో మరో సభ నిర్వహించి కాపులకు సవాల్ విసిరింది. మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. వైసీపీ ఈ ఎత్తుగడ వేయడం, తెలగ,బలిజ,కాపు,ఒంటరి కులాలను ఏకతాటిపైకి తేవాలనుకున్న కాపునాడుకు గంటా రూపంలో రాజకీయ రంగు అంటడంతో కాపుజాతికి తీరని అన్యాయం మళ్లీ జరిగిందనే భావన నెలకొన్నది.