జమ్మూ నగరానికి ఆనుకుని ఉన్న సిద్ధా ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రస్తుతం సంబంధిత ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సిద్దాలోని పోలీస్ పోస్ట్పై ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు ఉదయం సిద్దా వంతెన వద్ద తనిఖీ కోసం ఒక ట్రక్కును ఆపారు. పోలీసులను చూసిన డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రక్కులో కూర్చున్న మరికొందరు కాల్పులు ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్కౌంటర్ మొదలైంది. ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సిద్ధా బైపాస్ ప్రాంతంలోని తావి వంతెన సమీపంలో దట్టమైన పొగమంచు మధ్య తెల్లవారుజామున ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగిందని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ముఖేష్ సింగ్ తెలిపారు.
ఉగ్రవాదులు ట్రక్కులో దాక్కున్నారని, జమ్మూ నుంచి కాశ్మీర్ వైపు వెళ్తున్నారని చెప్పారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. డిసెంబరు 6 అర్థరాత్రి సిద్దా వంతెన సమీపంలోని పోలీసు పోస్టుపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. వంతెనపై ఉన్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. అయితే, దాడి చేసిన వారి గురి తప్పిపోవడంతో గ్రెనేడ్ సమీపంలోని విద్యుత్ స్తంభం, చెట్టు మధ్య పడింది.