ఓ భారీ గ్రహశకలం భూమి వైపుకు దూసుకొస్తోంది. ఇదిప్పుడు కరోనా కంటే ఎక్కువగా శాస్త్రవేత్తలను భయపెడుతోంది.. ఈ గ్రహ శకలం సైజులో అత్యంత భారీ పరిమాణంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, దాని వేగం కూడా ఇదివరకటి అస్టరాయిడ్లతో పోల్చుకుంటే.. రెట్టింపు ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా ‘ చెబుతోంది.
కొద్ది రోజుల్లో ఈ గ్రహశకలం భూకక్ష్యలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ గ్రహశకలం పరిమాణం సుమారు 3,280 అడుగులుగా ఉందని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎత్తు దాని అంచు వరకూ లెక్కస్తే 443 మీటర్లు. తాజగా భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది. ఈ గ్రహశకలాన్ని 7482 (1994పీసీ1) అనే నెంబరుతో పిలుస్తున్నారు.
నిజానికి ఈ గ్రహశకలం ఇప్పటిది కాదు. దీనిని 1994లో మొదట గుర్తించారు. 1994 ఆగస్టు 9న ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీ సైంటిస్ట్ రాబర్ట్ మెక్నాట్ దీన్ని కనుగొన్నారు. భవిష్యత్తులో ఇది భూమికి అత్యంత సమీపానికి వస్తుందంటూ అప్పట్లో రాబర్ట్ మెక్నాట్ అంచనా వేశారు. ఆ అంచనా ఇప్పడు వాస్తవ రూపం దాల్చుతోంది.
ఈ గ్రహశకలం వేగం సెకనుకు 19.56 కిలోమీటర్లు. అంటే కన్నుమూసి తెరిచే లోపలే మాయం అయ్యేంత వేగంతో ఇది ప్రయాణిస్తోంది. గంటకు 43,754 మైళ్లతో భూకక్ష్య వైపుకు దూసుకొస్తోందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ నెల 18న యూనివర్సల్ టైమ్ జోన్ ప్రకారం.. ఉదయం 9:23 నిమిషాలకు ఈ అస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటుందని, అదే వేగంతో విశ్వాంతరాల్లోకి దూసుకెళ్తుందని పేర్కొన్నారు.