ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ఎత్తులు పైఎత్తులకు పదును పెడుతున్నారు. అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతాపార్టీ ప్రచారంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంపికలోనూ అచితూచి వ్యవహరిస్తోంది. అదేసమయంలో టికెట్ విషయంలో ఎలాంటి అవకాశాలను వదులుకోకూడదని అభ్యర్థులు భావిస్తున్నారు.
21 అసెంబ్లీ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ ఆత్మీయులతో పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు అరడజను మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కట్ కానుందని బీజేపీ హైకమాండ్ సూచించడంతో పోటీదారులలో ఉత్కంఠ నెలకొంది.
మరోసారి ఉత్తరాఖండ్లో పాగా వేసేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టింది. పార్టీలో అసమ్మతి ఉన్న సీనియర్ నేతలను సైతం ఈసారి పక్కనబెట్టాలని అధిష్టానం భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో చాలా మంది కొత్త ముఖాలను రంగంలోకి దించవచ్చని తెలుస్తోంది. దీంతో అశావాహులు తమ తమ నియోజకవర్గాలలో సిట్టింగ్ లకు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఓం గోపాల్ రావత్కు ఈసారి కూడా టికెట్ దక్కేలా కనిపించడంలేదు. నరేంద్రనగర్ అసెంబ్లీ సీటుపై ఆశలు పెట్టుకున్న ఆయనకు మంత్రి రూపంలో చుక్కెదురు కానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియాల్ కూడా పోటీ పడుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఓం గోపాల్ కూడా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.