కేంద్రం చెబుతున్న ఉమ్మడి పౌర స్మృతి దేశభ్యున్నతికి గొడ్డలి పెట్టు అని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ఈ చట్టం తూట్లు పొడుస్తుందని ధ్వజమెత్తారు. ఈ చట్టం వల్ల దేశంలో పౌరుల స్వేచ్ఛకు తీవ్ర స్థాయిలో భంగం కలుగుతుందని అన్నారు.
దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే పౌర స్మృతి బిల్లును పార్లమెంటులో అడ్డుకుని తీరుతామని నామ స్పష్టం చేశారు. బిల్లును ఉపసంహరించేంత వరకు బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యేక కార్యాచరణ తో బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామన్నారు. ఉభయ సభలను స్తంభింప జేస్తామని చెప్పారు.
దేశ అభివృద్ధి ని విస్మరించిన కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల్ని విస్మరించి, విద్వేష రాజకీయాలు చేస్తుందని అన్నారు. భారతీయులు ఐక్యతను చీల్చే ఎటువంటి చర్యలనైనా భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి వ్యతిరేకిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో బీజేపీ కుట్రలను తిప్పికొడ తామని నామ చెప్పారు. విభిన్న జాతులు, కులాలు, మతాలు, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలను హరించే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును చట్టం కానివ్వమని స్పష్టం చేశారు.
యూసీసీ పై పార్లమెంట్ సాక్షిగా బీఆర్ఎస్ తన గళాన్ని విప్పుతుంద న్నారు. తక్షణమే ఉమ్మడి పౌర స్మృతి బిల్లును వెనక్కి తీసుకోవాలని నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ బిల్లు వల్ల దేశ ప్రజలు అయోమ యానికి గురవుతున్నారని తెలిపారు. తొమ్మిదేళ్లుగా దేశ అభివృద్ధి ని , ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని మోదీ ప్రభుత్వం తరతరాల సంస్కృతి సాంప్రదాయాలకు , లౌకికతత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
దేశ ప్రజలను రెచ్చగొట్టి, రాజకీయ పబ్బం గడుపు కోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పి తీరుతామని నామ అన్నారు. దేశ ప్రజలందరి తరపున బీఆర్ఎస్ గురుతర ఉద్యమాన్ని కొనసాగిస్తుందని నామ చెప్పారు. దేశంలో అపరిష్కృత సమస్యలెన్నో ఉన్నా పట్టించుకోకుండా కేంద్రం యూసీసీ పై మొండిగా వాదిస్తుందని అన్నారు.
బీజేపీ నుంచి దేశాన్ని కాపాడు కుంటామని నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడూ సెక్యులర్ భావాలను, సర్వ మతాలు, కులాలను గౌరవిస్తుంద న్నారు.రాష్ట్రంలో, ఖమ్మం లో మతతత్వ పార్టీలకు స్థానమే లేదని నామ నాగేశ్వరరావు చెప్పారు.