ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై వైసీపీ రాళ్ల దాడి ఘటనపై ఎన్ఎస్జీ హెడ్క్వార్టర్స్ సీరియస్గా తీసుకుంది. రాళ్ల దాడిపై ఎన్ఎస్జీ హెడ్ క్వార్టర్స్కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్ఎస్జీ కమాండెంట్కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్ను అధికారులు స్కానింగ్కు పంపించారు. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై ఎన్ఎస్జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
గతంలో నందిగామ, ఇప్పుడు యర్రగొండపాలెం దాడి ఘటనలపై ఎన్ఎస్జీ బృందం నివేదిక ఇచ్చింది. దీనిపై నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. స్థానిక పోలీసులు ఎన్ఎస్జీకి పూర్తిగా సహకరించాల్సి ఉండగా ప్రకాశం జిల్లాలో అలా జరగలేదు. స్థానిక పోలీసులు పకడ్బందిగా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే చంద్రబాబుపై దాడి జరిగినట్లు హెడ్ క్వార్టర్స్ కు నివేదిక పంపారు.
దాంతో స్థానిక పోలీసులపై చర్యలు తీసుకునేందుకు అవకాశం కలిగింది. మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పారని, పోలీసులు కూడా చోద్యం చూస్తూ నిలబడిపోయారని నివేదికలో పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో చంద్రబాబుపై పడకుండా ఎన్ఎస్జీ కమేండోలు చుట్టూ రక్షణ కవచంగా నిలిచారు. ఈ క్రమంలో కమాండెంట్ సంతోష్కుమార్ తలకు రాయి తగిలి గాయమైంది. వెంటనే యర్రగొండపాలెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికు సంతోష్కుమార్ను తరలించి చికిత్స అందజేశారు. వైద్యులు కమెండో తలకు మూడు కుట్లు వేశారు. అయితే తాము అడ్డుగా లేకపోతే చంద్రబాబుపైనే రాళ్లు పడేవని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.