బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే దగ్గుబాటి పురందరేశ్వరి జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. పురందరేశ్వరి విమర్శలు అధికార వైసీపీకి మింగుడు పడటంలేదు. వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించి, తాను సీఎం జగన్ వ్యతిరేకి అనుకునేలా ఆమె చేశారు. రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామన్న హామీ ఏమైందని సీఎం జగన్ను నిలదీశారు. కేంద్రం ఇస్తున్న రూ.6 వేలు గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇది రైతులను సీఎం జగన్ మోసం చేయడం కాదా అంటూ మండిపడ్డారు.
సొంత బాబాయ్ వివేకా హత్య కేసుని విచారణ చేయలేమని జగన్ సర్కార్ చేతులెత్తేసిందన్నారు. అక్కను వేధించవద్దని అడ్డుపడ్డ పదో తరగతి బాలుడిని పెట్రోల్ పోసి చంపేశారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని.. ఉన్నవి తరలిపోతున్నాయని పురందరేశ్వరి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని విమర్శించారు.
విశాఖలో ఎంపీ కుటుంబానికే రక్షణ లేదన్నారు. నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోందని మండిపడ్డారు. నాణ్యత లేని బ్రాండ్లను విక్రయిస్తున్న సొమ్ము తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లడం లేదా అంటూ నిలదీశారు. మైనింగ్ వ్యాపారులపై దాడులు చేయించి తనకు అనుకూలంగా ఉన్నవారికి ఇప్పించుకుంటూ దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తోందన్నారు. ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జా చేస్తున్నారని పురంధరేశ్వరి విమర్శించారు. ఇలా జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించడం ద్వారా తొలి రోజే వైసీపీ వ్యతిరేకిగా పురంధరేశ్వరి చేసిన విమర్శలు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.