విజయనగరం వన్ టౌన్ లో పిఎస్ లో నమోదు చేసిన ఎల్.ఎస్.డి. డ్రగ్స్ కేసులో బెంగుళూరుకు చెందిన 3వ నిందితుడు (ఎ-3)ని అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్ వెల్లడించారు. ఈ సందర్భంగా విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ టి.త్రినాధ్ మాట్లాడుతూ – జిల్లాలో ప్రప్రధమంగా లైసర్జిక్ ఏసిడ్ డయాథమైడ్ అనే డ్రగ్ పట్టుకోవడం జరిగిందన్నారు.
విజయనగరంకు ఉల్లివీధికి చెందిన (1) ఎ-1, కొండపు సందీప్ రెడ్డి (27 సం.లు) మరియు కుమ్మరి వీధికి చెందిన (2) ఎ-2, శఠగోపం గణేష్ (26 సం.లు) చెందిన ఇద్దరు నిందితులను ఇటీవల అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. ఇందులో మరో కీలక నిందితుడు (ఎ-3) విశాఖపట్నంకు చెందిన ప్రస్తుతం బెంగుళూరులో నివాసం ఉంటున్న కట్టా ఆంజనేయ కాళిదాసు అలియాస్ కిట్టూ అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి 2కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, రిమాండు కు తరలించామన్నారు.
ఈ కేసులో ఎ-3 నిందితుడు కట్టా ఆంజనేయ కాళిదాసు అలియాస్ కిట్టూ విచారణలో తాను కేరళ రాష్ట్రంకు చెందిన అఖిల్ జీత్ అనే వ్యక్తి వద్ద ఎల్.ఎస్.డి. డ్రగ్ బ్లాట్స్ కొనుగోలు చేసి, ఎ-1 కొండపు సందీప్ రెడ్డికి కొరియర్ ద్వారా పంపానన్నాడు. కానీ, కొరియర్ ద్వారా పంపిన డ్రగ్ అందినది లేనిది తెలుసుకొనేందుకు తాను సందీప్ రెడ్డికి ఎన్నిసార్లు ఫోను చేసినప్పటికీ ఫోను లిఫ్ట్ చేయకపోవడంతో తాను బెంగుళూరు నుండి సెప్టెంబరు 21న విశాఖపట్నం వచ్చానన్నారు.
విశాఖపట్నం నుండి అరకు వెళ్ళి అక్కడ గుర్తు తెలియని ఒక వ్యక్తి వద్ద నుండి రెండు కిలోల గంజాయిని కొనుగోలు చేసి, విజయనగరం ఆర్టీసి కాంప్లెక్స్ వద్ద దిగి, సందీప్ రెడ్డి (ఎ-1)ను కలిసేందుకు గాను పట్టణంలో ఉల్లివీధి మసీదు వద్ద ఉండగా, పోలీసులకు పట్టుబడినట్లుగా డిఎస్పీ టి. త్రినాధ్ తెలిపారు. అలాగే విజయనగరం పిఎస్ లో విజయనగరం వన్ టౌన్ సిఐ డా. బి. వెంకటరావు, ఎస్ఐలు దుర్గా ప్రసాద్, విజయకుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.