హైదరాబాద్ కేపీహెచ్బీ పీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 10 రోజుల కిందట భవనం ఆరో అంతస్తులో గోడపై ఎలివేషన్ నిర్మించే క్రమంలో చిన్నపాటి స్లాబ్ వేశారు.
ఈ శ్లాబ్కు సంబంధించి సెంట్రింగ్ సామగ్రి తీస్తుండగా.. ఎలివేషన్ గోడ ఒక్కసారిగా కూలి పరంజిపై పడింది.గోడకూలి పరంజిపై పడటంతో అక్కడే పనిచేస్తున్న సంతు (23), సోనియా (23) ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు తీవ్రంగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సానియా (23) మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా రెండు నెలల క్రితం ఒడిశా నుంచి నగరానికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించారు.