పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంగుంట్ల గ్రామంలో “ఫ్యామిలీ ఫిజిషియన్” కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు 6న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీస్ అధికారులు చేస్తున్న భద్రత ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినీ, జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ లతో కలసి పరిశీలించి,పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసి,పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆదేశించారు.
వీవీఐపి రాకకోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణాన్ని పరిశీలించి,ఆ ప్రదేశానికి చుట్టుప్రక్కల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తుగా తగిన సిబ్బందితో పహారా నియమించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. తదనంతరం హెలిప్యాడ్ నుండి సభాస్థలికి వీవీఐపి పయనించే మార్గాన్ని స్వయంగా పరిశీలించి,రాకపోకలకు సంబంధించి ఎటువంటి అవాంతరాలు ఎదురుకాకుండా రోడ్డుకు ఇరువైపులా భారీకేడింగ్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తదుపరి సభాస్థలికి చేరుకుని మంత్రి, జిల్లా కలెక్టర్, ముఖ్యమంత్రి పర్యటన పరిశీలన కోర్దినేటర్ ఎమ్మెల్సీ తలశిలరఘురాం, జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) G. బిందుమాధవ్ ఇతర అధికారులతో సభా ప్రాంగణాన్ని,వీవీఐపి మరియు వీఐపీలు ఆసీనులయ్యే స్టేజి నిర్మాణమును,దాని పటిష్టతను పరిశీలించారు.
సభకు విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్న భారీ కెడింగ్ మరియు క్యూలైన్లను పరిశీలించి,వాటిని పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు తగినంత మంది సిబ్బందిని నియమించి అవసరమైన చోట ట్రాఫిక్ డైవర్షన్లు, స్టాప్ బోర్డులను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. హెలిప్యాడ్,సభాప్రాంగణం మరియు వీవీఐపి ప్రయాణించే మార్గాల్లో నిఘా వర్గాలతో నిరంతర పహారా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) రామచంద్రరాజు , నరసరావుపేట డిఎస్పీ విజయభాస్కర్ రావు,ఏఆర్ డిఎస్పీ చిన్నికృష్ణ,ఎస్బీ సీఐ ప్రభాకర్,చిలకలూరిపేట రూరల్ మరియు టౌన్ సీఐలు అచ్చయ్య ,రాజేశ్వరరావు ,ఎస్సైల రాజేష్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.